శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: శుక్రవారం, 13 జులై 2018 (20:12 IST)

కడుపు మంటతో కునుకు పట్టడం లేదు... అసలాయన తెలుగోడేనా?

అమరావతి : ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశ్‌కు మొదటి ర్యాంకు రావడంతో వైఎస్ఆర్ సిపి, బీజేపీ నేతలకు చెంప పెట్టులాంటిదని, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఆ పార్టీ నేతలకు కడుపు మంటతో కంటి మీద కునుకు రావడంలేదన్నారు.

అమరావతి : ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశ్‌కు మొదటి ర్యాంకు రావడంతో వైఎస్ఆర్ సిపి, బీజేపీ నేతలకు చెంప పెట్టులాంటిదని, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఆ పార్టీ నేతలకు కడుపు మంటతో కంటి మీద కునుకు రావడంలేదన్నారు. ఏపీకి మొదటి ర్యాంకు రావడం తమ ప్రభుత్వ నాలుగేళ్ల కష్టానికి తగిన ప్రతిఫలమన్నారు. సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్‌లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2015లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీకి రెండో ర్యాంకు వచ్చిందన్నారు. 2016లో తెలంగాణతో కలిసి సంయుక్తంగా మొదటి ర్యాంకులో నిలిచామన్నారు. 
 
2017లో మరోసారి ఒంటిరిగా ఆంధ్రప్రదేశ్ మొదటి ర్యాంకు సాధించిందన్నారు. మూడేళ్ల నుంచి రెండు, మొదటి ర్యాంకు సాధించడం ఆషామాషీ వ్యవహారం కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం, వరల్డ్ బ్యాంకు ప్రతినిధులు చేసిన సర్వేలో 87 శాతం మంది పెట్టుబడిదారులు ఏపీకి అనుకూలంగా చెప్పారన్నారు. భూములు, నీళ్లు, విద్యుత్ ఇవ్వడమే కాకుండా విజన్ ఉన్న నాయకుడు సీఎంగా ఉండడం పెట్టుబడిదారులను ఆకర్షించిందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ మొదటి స్థానంలో నిలవగా గుజరాత్ అయిదో స్థానంతో సరిపెట్టుకుందన్నారు. మైక్రో ఇరిగేషన్‌లో కూడా దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. 
 
ఏపీకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో మొదటి ర్యాంకు రావడం ఏపీలో పుట్టి, తెలుగు వాళ్లై ఉండి కూడా బీజేపీ, వైఎస్ఆర్ సిపి నేతలు ఓర్వలేకపోతున్నారన్నారు. కడుపుమంటతో వాళ్లకు కంటిమీద కునుకు పట్టదంలేదన్నారు. నెంబర్ వన్ ర్యాంకు రావడం వాళ్లకు చెంప పెట్టులాంటిందన్నారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఏపీ నుంచి పెట్టుబడులు తరలిపోయాయని, కేసులు మిగిలాయని, రాష్ట్రానికి అప్రతిష్ట వచ్చిందని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దుయ్యబట్టారు. మంత్రులు, అధికారులు జైలు పాలయ్యారన్నారు. ‘వైసీపీకి చెందిన ఒక నేత మాట్లాడుతూ, ఏపీకి ప్రథమ స్థానం కాదు అథమ స్థానం వచ్చిందని అన్నారని, ఈ వ్యాఖ్యలతో ప్రతిపక్ష నేతల ఓర్వలేనితనం బయటపడుతోందని’ మంత్రి అన్నారు. 
 
కాంగ్రెస్ హయాంలో రాష్ట్రానికి రావాల్సిన వోక్స్ వాగన్ సంస్థ పుణెకు తరలిపోయిందన్నారు. దీనికి వైసీపీ నేతలు సిగ్గుపడాలన్నారు. అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్‌ను అవినీతి రాష్ట్రంగా మార్చరన్నారన్నారు. అటువంటి నేతలు ఇప్పుడు తమపై బుదరజల్లుతూ మాట్లాడుతుండడం గర్హనీయమన్నారు. సీఎం చంద్రబాబునాయుడు కృషి ఫలితంగా కియో మోటార్స్ అనంతపురానికి వచ్చిందన్నారు. వచ్చే జనవరి అనంతపురంలో తయారయ్యే కియో కార్లు ప్రపంచం రోడ్లపై దూసుకుపోతాయన్నారు. దేశంలో పది అంతర్జాతీయ మొబైల్ కంపెనీలు వస్తే వాటిలో రెండు ఏపీలో ఉత్పత్తిని ప్రారంభించాయన్నారు. ఎఫ్.డి.ఐల రూపంలో కియో, హీరో, అశోక్ లేల్యాండ్, సెల్ కాన్ వంటి సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టాయన్నారు. తమ ప్రభుత్వ నాలుగేళ్ల పాలనతో వరుస విజయాలు వస్తున్నాయన్నారు. 
 
పాదయాత్రల పవిత్రతను జగన్ మంటగలుపుతూ అభాసుపాలు చేస్తున్నారన్నారు. క్యాట్ వ్యాక్ పాదయాత్ర చేస్తూ, ప్రతి శుక్రవారమూ కోర్టులో హాజరు వేసుకోవడం ఇదీ జగన్ పాదయాత్ర తీరు అన్నారు. సీఎం చంద్రబాబునాయుడు ఆనాడు చేసిన పాదయాత్ర ఎంతో స్ఫూర్తిదాయకంగా సాగిందన్నారు. చావో బతుకో అన్న చందంగా సీఎం చంద్రబాబు పాదయాత్ర చేశారన్నారు. మహానాయకుడు కింజరాపు ఎర్రన్నాయుడు దుర్మరణం పొందినప్పుడు శ్రీకాకుళం వెళ్లడానికి మాత్రమే పాదయాత్రకు విరామం ఇచ్చారన్నారు. జగన్ తీరుతో భవిష్యత్తులో ఇంకెవ్వరూ పాదయాత్ర చేయడానికి ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై బీజేపీ, వైఎస్ఆర్ సిపి నేతలు అవినీతి బురద జల్లాలని చూస్తున్నారని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. 
 
కేంద్రమంత్రి నితిన్ గడ్కారీతో పాటు కేంద్ర బృందాల సభ్యులు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు బ్రహ్మాండంగా సాడుతున్నాయని కొనియాడారన్నారు. ఎవ్వరూ వేలెత్తి చూపని విధంగా నిర్మాణ పనులు చేపడుతున్నామన్నారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కారీతో పోలవరం నిర్మాణాల్లో అవినీతి జరుగుతోందని చెప్పించగలరా అని మంత్రి సవాల్ విసిరారు. ఏపీని నాశనం చేయడానికే రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నాయకుడు జీవీఎల్ నర్సింహారావు కంకణం కట్టుకున్నట్లుందని మండిపడ్డారు. ఆయనసలు తెలుగోడేనా అని ప్రశ్నించారు. ఏపీ ప్రజలకు అవమానం కలిగేలా ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు. రోజూ సీఎం చంద్రబాబునాయుడు తిడితే భరిస్తామని, కాని రాష్ట్రానికి పెట్టుబడులు, గుర్తింపు రాకుండా కుట్రలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. 
 
కడపలో ఉక్కు ఫ్యాక్టరీ, దుగ్గరాజుపట్నంలో పోర్టు, విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటయ్యేలా పోరాడాలని జీవీఎల్ కు హితవు పలికారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో పెట్టుబడులు పెడతామంటూ 33,288 దరఖాస్తులు వచ్చాయని, వాటిలో 31,838 దరఖాస్తులకు అనుమతులు మంజూరు చేశామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. తమ తండ్రి సీఎం అయ్యాడని, తద్వారా ఇతరుల డబ్బులతో లేని కంపెనీల్లో జగన్ పెట్టుబడులు పెట్టించారని అన్నారు. పోలవరం నిర్మాణంపై ఏ వివరాలు కావాలంటే అవి అందిస్తామని, కావాలనుకుంటే తానే స్వయంగా ఢిల్లీ వచ్చి చెబుతానని కేంద్రమంత్రి నితిన్ గడ్కారీకి సీఎం చంద్రబాబునాయుడు స్పష్టం చేశారన్నారు. ఇప్పటికైనా బీజేపీ, వైఎస్ఆర్ సిపి నేతలు తమ తీరును మార్చుకోకుంటే ప్రజల చేతిలో అవమానానికి గురికాకతప్పదని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హెచ్చరించారు.