1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 14 మార్చి 2021 (13:06 IST)

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు : వైకాపా జోరు... పత్తాలేని టీడీపీ

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ సరికొత్త రికార్డ్‌ సృష్టిస్తోంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో క్లీన్‌స్వీప్‌ దిశగా వైసీపీ అభ్యర్థులు దూసుకుపోతున్నారు. అన్ని జిల్లాల్లోనూ వైసీపీ సత్తా చాటుతోంది. ఫ్యాన్‌ దూకుడుకు టీడీపీ, బీజేపీ, జనసేన పత్తా లేకుండా పోతున్నాయి. ఇప్పటివరకు 3 కార్పొరేషన్లు వైసీపీ కైవసం చేసుకుంది. చిత్తూరు, తిరుపతి, కడప కార్పొరేషన్లలో విజయం సాధించింది.
 
ఇదిలావుంటే… ఆంధ్రప్రదేశ్‌లోని 13జిల్లాల్లో జరిగిన పురపోరులో 11 కార్పొరేషన్లు… 71మున్సిపాలిటీలకు 10న ఎన్నికలు జరిగాయి. అయితే ఇందులో పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు కార్పొరేషన్‌తో పాటు గుంటూరు జిల్లా చిలకలూరిపేట మున్సిపాలిటీ ఫలితాలను మాత్రం హైకోర్టు ప్రకటించవద్దని ఆదేశించింది.
 
కాగా, ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ హవా కొనసాగుతోంది. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ పూర్తయింది. మొత్తం 25 వార్డులలో ఏకగ్రీవాలతో కలుపుకొని 24 వైసీపీ కైవసం చేసుకుంది. ఒక స్థానాన్ని మాత్రమే టీడీపీ గెలిచింది. జిల్లాలోని వెంకటగిరి మున్సిపాలిటీ మొత్తం అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేసింది. ఇక్కడ టీడీపీ 25 వార్డులలో పోటీచేయగా ఒక్క వార్డులో కూడా గెలుపొందలేదు.