1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 10 డిశెంబరు 2020 (12:04 IST)

ఒరే.. మీకెంత ధైర్యం.. నా కారే ఆపుతారా? రెచ్చిపోయిన రేవతి!

'ఒరే.. మీకెంత ధైర్యం. నా కారే ఆపుతారా?' అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ ఛైర్మన్ దేవళ్ల రేవతి రెచ్చిపోయారు. టోల్ ఫీజు చెల్లించకుండా వెళ్తున్న రేవతిని టోల్ గేట్ సిబ్బంది అడ్డుకున్నారు. ఆమె కారు ముందుకు వెళ్లకుండా బారికేడ్లు పెట్టారు. ఈ ఘటన గుంటూరు జిల్లా కాజా టోల్ ప్లాజా వద్ద జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఏపీ వడ్డెర కార్పొరేషన్ ఛైర్ పర్సన్‌గా రేవతి ఉన్నారు. ఈమె తన మందీమార్బలంతో కారులో విజయవాడకు బయలుదేరారు. అయితే, కాజా టోల్‌ప్లాజా వద్ద టోల్ ఫీజు చెల్లించకుండా ముందుకెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ, సిబ్బంది మాత్రం టోల్ ఫీజు చెల్లించి ముందుకు వెళ్లాలని సిబ్బంది తేల్చి చెప్పారు. 
 
అంతే.. ఆమెకు ఒక్కసారిగా కోపం నషాళానికెక్కింది. దీంతో ఆమె ఆగ్రహంతో ఊగిపోతూ కారు దిగి చెలరేగిపోయారు. నన్నే ఆపుతావా? అంటూ పరుష పదజాలంతో సిబ్బందిపై విరుచుకుపడ్డారు. బారికేడ్‌ను పక్కకు నెట్టేసి, సిబ్బందిపై చేయి చేసుకున్నారు. ఆమె హడావిడితో టోల్‌గేట్ సిబ్బంది బెంబేలెత్తిపోయారు. 
 
టోల్ ఫీజు నుంచి ఆమెకు మినహాయింపు లేకపోయినప్పటికీ టోల్ కట్టకుండా వెళ్లేందుకు ఆమె ప్రయత్నించారు. దీంతో టోల్ గేట్ సిబ్బంది బారికేడ్లు అడ్డంపెట్టి ఆమె కారును ఆపేందుకు ప్రయత్నించడమే వారు చేసిన తప్పు. తన కారుకు అడ్డంగా పెట్టిన బారికేడ్లను స్వయంగా తొలగించిన ఆమె, అడ్డుకోబోయిన సిబ్బందిపై చేయిచేసుకున్నారు. అనంతరం విజయవాడ వైపు వెళ్లిపోయారు.