1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 10 డిశెంబరు 2020 (15:18 IST)

ఇకపై వన్ నేషన్.. వన్ రేషన్ : 9 రాష్ట్రాల్లో అమలు (video)

ప్రస్తుతం ఒకే దేశం... ఒకే పన్ను (జీఎస్టీ) చట్టాన్ని కేంద్రం అమలు చేసింది. ఇపుడు వన్ నేషన్.. వన్ రేషన్ అనే చట్టం అమలుకు శ్రీకారం చుట్టింది. ఈ చట్టాన్ని తొలుతు 9 రాష్ట్రాల్లో అమలు చేసినట్టు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. 
 
ఉపాధి వెతుక్కుంటూ రాష్ట్రాలు దాటే వలస కార్మికులు, వారి కుటుంబాలు సులువుగా రేషన్ సరుకులు పొందడానికి వన్ నేషన్.. వన్ రేషన్ పథకం ఉపయోగపడుతుంది. వాస్తవ లబ్దిదారులను గుర్తించడం, బోగస్ కార్డులను ఏరివేయడానికి ఇది ఉపకరించనుంది. అందుకే ఆధార్ అనుసంధానం, బయోమెట్రిక్ ధ్రువీకరణ, ఇతర కండీషన్లను సర్కారు తప్పనిసరిగా పెట్టింది. 
 
కాగా, కేంద్రం ఎంపిక చేసిన తొమ్మిది రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్, గోవా, గుజరాత్, హర్యానా, కర్ణాటక, కేరళ, తెలంగాణ, త్రిపుర, ఉత్తరప్రదేశ్‌లు ఉన్నాయి. ఈ రాష్ట్రాల ప్రజా పంపిణీ వ్యవస్థ సంస్కరణలను అమలు చేశాయని వివరించింది. రూ.4851 కోట్లతో యూపీ అతిపెద్ద లబ్దిదారుగా ఉందని, తర్వాతి స్థానాల్లో కర్ణాటక, గుజరాత్‌లున్నట్టు పేర్కొంది. అదనపు రుణాలు పొందగోరే రాష్ట్రాలు ఈ నెల 31వ తేదీలోపు సంస్కరణలు అమలు చేయాలని సూచించింది. 
 
కరోనా కష్టకాలంలో రాష్ట్రాలను ఆర్థికంగా ఆదుకునే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పలుచర్యలు తీసుకుంది. ఇందులో భాగంగానే ఆయా రాష్ట్రాల జీఎస్‌డీపీలో రెండు శాతం అదనపు రుణాలను గ్రాంట్ల కింద 2020-21 ఏడాదిలో తీసుకోవడానికి అనుమతినిచ్చింది. ఈ అనుమతిని పౌరులకు అత్యవసరమైన కొన్ని సంస్కరణలతో ముడిపెట్టింది. ఇందులో "వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్" వ్యవస్థ అమలు కోసం 0.25 శాతాన్ని కేటాయించింది.