శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: సోమవారం, 7 డిశెంబరు 2020 (19:58 IST)

తేనెలో కల్తీ: ‘చైనీస్ సుగర్ సిరప్‌లను కలిపి, అమ్మేస్తున్నారు’

భారత్‌లో కొన్ని సంస్థలు తేనెను చైనీస్ సుగర్ సిరప్‌తో కల్తీ చేసి అమ్ముతున్నాయని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ పరిశోధకులు వెల్లడించారు. తేనె స్వచ్ఛతను నిర్ధారించేందుకు ఫుడ్ సెఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఐ) 18 ప్రమాణాలను సూచించింది. వీటికి అనుగుణంగా ఉన్న తేనెనే స్వచ్ఛమైనదిగా పరిగణిస్తారు.

 
నాణ్యత పరీక్షల్లో ఈ సిరప్‌లు ఇలాంటి స్వచ్ఛమైన తేనెలాగా కనిపిస్తున్నాయి. భారత్‌లో తేనెను వివిధ ఔషధ మిశ్రమలతో కలిపి కూడా వాడుతుంటారు. కరోనావైరస్ వ్యాప్తి సమయంలో తేనె వినియోగం బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో 13 బ్రాండ్లకు చెందిన తేనె శాంపిల్స్‌ను సేకరించి పరిశోధకులు విశ్లేషించారు. గత ఆగస్టు నుంచి నవంబర్ మధ్య చిన్న చిన్న షాపుల్లో నుంచి ఈ శాంపిల్స్‌ను తీసుకున్నారు.

 
వీటిని గుజరాత్‌లోని సెంటర్ ఫర్ అనిమల్ అండ్ ఫుడ్ అనాలసిస్ అండ్ లెర్నింగ్ (సీఏఎల్ఎఫ్), నేషనల్ డైరీ డెవెలప్‌మెంట్ బోర్డ్‌లతోపాటు జర్మనీలోని ఓ ల్యాబ్‌కు పంపించి పరీక్షలు చేశారు. తేనెలో ప్రధానంగా సీ3, సీ4, ఫారెన్ ఓలిగోసాకరైడ్స్, స్పెసిఫిక్ మార్కర్ ఫర్ రైస్ (ఎస్ఎంఆర్) వంటి పదార్థాలు కలిసినట్లు పరిశోధకులు గుర్తించారు.

 
సీ4 సుగర్‌ను మొక్కజొన్న, చెరకు నుంచి... సీ3 సుగర్‌ను బియ్యం, బీట్‌రూట్ నుంచి తీస్తారు. చక్కెర, మొక్కజొన్న నుంచి తీసిన గంజి నుంచి ఓలిగోసాకరైడ్స్ తయారవుతాయి. జర్మనీలోని ల్యాబ్‌లో శాంపిల్స్‌కు ట్రేస్ మార్కర్ ఫర్ రైస్ సిరప్ (టీఎంఆర్), న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ రెసోనెన్స్ (ఎన్ఎంఆర్) అనే పరీక్షలు చేశారు. తేనెలో కల్తీని గుర్తించేందుకు ఎన్ఎంఆర్ పరీక్ష ఉపయోగపడుతుంది.

 
‘‘స్వచ్ఛమైన తేనెలో సగం మేర సుగర్ సిరప్ కలిసినా... సీ3, సీ4 పరీక్షల్లో గుర్తించవచ్చు. ట్రేస్ మార్కర్ టెస్ట్ ద్వారా సింథటిక్ సుగర్ ఎంతవరకూ ఉందన్నది గుర్తించవచ్చు’’ అని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ డైరెక్టర్ జనరల్ సునీత నరైన్ అన్నారు. తాము నిర్వహించిన నాణ్యత పరీక్షల్లో మారికో సఫోలా హనీ, మార్క్‌ఫెడ్ సోహ్నా, నేచర్ నెక్టార్ బ్రాండ్ల తేనెలు మాత్రమే పాస్ అయ్యాయని ఆమె చెప్పారు.

 
ఆన్‌లైన్‌లో అమ్మేస్తున్నారు
ఉత్తరాఖండ్‌లోని జస్‌పుర్‌లో తేనెలో కలిపేందుకు సుగర్ సిరప్ తయారు చేస్తున్నట్లు బయటపడింది. ఈ సిరప్ కలిపిన తేనెను సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ బృందం పరీక్షించింది. అయితే, ఎఫ్ఎస్ఎస్ఏ ప్రమాణాలకు ఇది అనుగుణంగానే ఉన్నట్లు ఫలితం వచ్చింది. ‘‘ఫ్రక్టోస్ సిరప్‌లు కలిపిన తేనెలు రెగ్యులేటరీ పరీక్షల్లో పాస్ అవుతున్నాయి. ఈ సిరప్‌లు అలీబాబా లాంటి ఈ-కామర్స్ వెబ్‌సైట్లలోనూ అమ్ముడవుతున్నాయి’’ సునీత నరైన్ హిందూ దినపత్రికతో అన్నారు.

 
కల్తీ సమస్యను పరిష్కరించేందుకు కొత్త పరీక్షలు, ప్రమాణాలను నిర్దేశిస్తూ కొత్త బిల్లును తెచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ ప్రమాణాలను చేరుకునేందుకు తయారీదారులకు వచ్చే ఏడాది దాకా గడువు ఇవ్వనున్నారు. ఇక తేనె కల్తీ జరుగుతున్నట్లు వచ్చిన ఆరోపణలపై డాబర్ సంస్థ స్పందించింది. తమ తేనెలో ఎలాంటి కల్తీ లేదని, వంద శాతం స్వచ్ఛత కోసం మొట్టమొదటిసారిగా పారిశ్రామిక స్థాయిలో ఎన్ఎంఆర్ యంత్రాలను వినియోగిస్తోంది తామేనని ఆ సంస్థ వివరించింది.