శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 10 డిశెంబరు 2019 (18:02 IST)

దేశ వ్యాప్తంగా ఉల్లిఘాటు ఉంది.. జగన్ పేదలపక్షపాతి : మంత్రి మోపిదేవి

దేశ వ్యాప్తంగా ఉల్లి ధరలు పెరిగాయని, ఒక్క మన రాష్ట్రంలోనే కాదని ఏపీ మంత్రి మోపిదేవి వెంకటరమణ చెప్పుకొచ్చారు. అయినప్పటికీ పేదలను దృష్టిలో ఉంచుకున ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి సబ్సీడీకి ఉల్లిపాయలను సరఫరా చేయాల్సిందిగా ఆదేశాలు జారీచేశారని చెప్పుకొచ్చారు. 
 
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా, ఆయన మంగళవారం మాట్లాడుతూ, సెప్టెంబరు నెల మధ్య నుంచి ఉల్లి ధర క్రమంగా పెరుగుతూ వస్తోంది. అప్పుడు ఈ అంశం చర్చించిన గౌరవ ముఖ్యమంత్రి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆ క్రమంలోనే సెప్టెంబరు 27 నుంచి అక్టోబరు 2 వరకు మొదటి విడతలో మార్కెట్‌ ఇంటర్‌వెన్షన్‌ ఫండ్‌ ద్వారా కిలో ఉల్లి రూ.25కే సరఫరా చేశాము. 
 
అప్పుడు 6,731 క్వింటాళ్ల ఉల్లి కొనుగోలు చేసి వినియోగదారులకు సరఫరా చేశాము. నవంబరు 14 నుంచి మళ్లీ ఉల్లి ధరలు పెరిగాయి. అప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి నిర్ణయం, ఆదేశం మేరకు ఇతర ప్రాంతాల నుంచి ఉల్లి కొనుగోలు చేసి, కిలో ఉల్లి రూ.25కే సరఫరా చేస్తున్నాం.
 
ఆ విధంగా ఇప్పటివరకు 38 వేల క్వింటాళ్ల ఉల్లిని కొనుగోలు చేసి రాష్ట్రంలోని 101 రైతుబజార్లలో కిలో ఉల్లి రూ.25కే విక్రయిస్తున్నాము. ఇందుకోసం వ్యవసాయ మిషన్, మార్కెటింగ్‌ శాఖ అధికారులు నాలుగు పర్యాయాలు సమావేశమయ్యారు.
 
ఈ నెల 5వ తేదీన అత్యధికంగా కేజీ ఉల్లి బయటి మార్కెట్‌లో కిలో రూ.120కి కొనుగోలు చేసి వినియోగదారులకు కిలో ఉల్లి రూ.25కే సరఫరా చేశాము. సహజంగానే ఈ ఏడాది దేశంలో అత్యధిక వర్షాలు కురిశాయి. ఉల్లి పంట చేతికొచ్చే సమయంలో పంట తగ్గింది. మరోవైపు సాగు కూడా ఈ ఏడాది బాగా తగ్గింది.
 
రాష్ట్రంలోనే కాదు, దేశం మొత్తం మీద ఉల్లి ధరలు పెరిగాయి. అయినా కిలో ఉల్లి రూ.25కే వినియోగదారులకు అందించాలని గౌరవ ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆ మేరకు ఉల్లి కొనుగోలు చేసి సరఫరా చేస్తున్నాము.
 ఉల్లి సరఫరాకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న చర్యలపై క్లుప్తంగా వివరాలు ఇవీ అని సభకు వివరించారు.