శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 15 ఆగస్టు 2022 (19:51 IST)

గవర్నర్ తేనీరు విందు - మూడేళ్ళ తర్వాత ఒకే కార్యక్రమానికి జగన్ - బాబు

babu - jagan
దేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజ్‌భవన్‌లో ఎట్ హోమ్ కార్యక్రమం జరిగింది. సోమవారం సాయంత్రం జరిగిన ఈ తేనీటి విందు ఈ కార్యక్రమానికి విపక్ష నేత హోదాలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఇతర టీడీపీ నేతలు హాజరయ్యారు. 
 
పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు అచ్చెన్నాయుడు, కేశినేని నాని, గద్దె రామ్మోహన్, అశోక్ బాబు ఈ కార్యక్రమానికి వచ్చారు. తెదేపా బృందాన్ని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సాదరంగా స్వాగతించారు. టీడీపీ నేతలంతా ఒకే టేబుల్ వద్ద ఆసీనులయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలను టీడీపీ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది.
 
మరోవైపు, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా తన సతీమణి భారతీ రెడ్డితో కలిసి ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తదితర ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. అయితే, ఒకే కార్యక్రమంలో సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు నాయుడులు పాల్గొనడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
tdp team
 
నిజానికి రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్‌లో అప్పటి గవర్నర్ నరసింహన్ నిర్వహించిన ఎట్‌హోమ్ కార్యక్రమంలో సీఎం హోదాలో చంద్రబాబు, ప్రతిపక్ష నేతగా జగన్ హాజరయ్యారు. ఆ తర్వాత ఇదిగో ఇప్పుడు మూడేళ్ల తర్వాత ఒకే కార్యక్రమంలో జగన్‌, చంద్రబాబు పాల్గొనడం గమనార్హం. 
 
ఒకప్పుడు చంద్రబాబు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కలిస్తే అక్కడంతా ఆహ్లాదకర వాతావరణమే ఉండేది. చూడటానికి కూడా కన్నుల పండువగా ఉండేది. కానీ జగన్ హయాంలో అలాంటి పరిస్థితి లేదనే విమర్శలున్నాయి.
tdp team
 
ఇటీవల ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అన్ని రాష్ట్రాల సీఎంలతో పాటు ప్రతిపక్ష నేతలను కూడా ఆహ్వానించారు. ఈ సమావేశానికి జగన్‌, చంద్రబాబు ఇద్దరిని ఆహ్వానించారు. 
 
'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' సమావేశం చంద్రబాబు, జగన్ పాల్గొంటారని అందరూ అనుకున్నారు. ఈ భేటీకి చంద్రబాబు మాత్రమే హాజరయ్యారు. అంతకుముందు నిర్ణయించుకున్న కార్యక్రమాల వల్ల జగన్ హాజరుకాలేదు. ఇదిగో ఇప్పుడు రాజ్‌భవన్‌లో నిర్వహించిన ఎట్‌హోమ్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే, వీరిద్దరూ తారసపడ్డారా? ఒకవేళ ఎదురుపడితే వారేం మాట్లాడుకున్నారు? అనేది తెలియాల్సివుంది.