బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 17 ఆగస్టు 2020 (08:28 IST)

వరదల పట్ల అప్రమత్తంగా ఉండండి: కలెక్టర్లకు జగన్‌ ఆదేశం

గోదావరి వరద పరిస్థితులపై సీఎం వైయస్‌.జగన్‌ ఆరా తీశారు. ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ముంపు ప్రాంతాలనుంచి ఇప్పటికే చాలామందిని తరలించారని, వచ్చే వరదను దృష్టిలో ఉంచుకుని మరిన్ని చర్యలు తీసుకుంటున్నట్టుగా సీఎంఓ అధికారులు సీఎంకు వివరించారు.

ఉభయగోదావరి జిల్లాల కలెక్టర్లకు ఈమేరకు ఆదేశాలు ఇచ్చినట్టుగా కూడా ఆయనకు తెలిపారు. వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. ముంపునకు గురయ్యే ప్రాంతాలపై దృష్టిపెట్టాలని, ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా వారిని రక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. దీనికోసం ప్రత్యేకంగా సహాయపునరావాస శిబిరాలు తెరిచి వారికి అన్నిరకాల సౌకర్యాలు అందించాలన్నారు.

ఉభయగోదావరి జిల్లాలకు చెందిన ఇద్దరు కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సీఎం స్పష్టంచేశారు. రక్షణ చర్యలు, సహాయ పునరావాస కార్యక్రమాలకోసం ఎస్డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్‌ సహా సంబంధిత సిబ్బందిని సిద్ధంచేసుకోవాలన్నారు. రాష్ట్ర విపత్తు నిర్వహణా శాఖతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుని తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లును ఆదేశించారు.

గోదావరి వరద ఉద్ధృతి, ముంపు పరిస్థితులపై ఎప్పటికప్పుడు తనకు నివేదించాలన్నారు. ఇటు కృష్ణాజిల్లాలోకూడా భారీ వర్షాలు, అనంతర పరిస్థితులపై సీఎం ఆరాతీశారు. అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తూ బాధితులను ఆదుకోవాలని ఆదేశించారు.