మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 21 ఏప్రియల్ 2019 (12:08 IST)

ఏపీ సీఎం సహాయ నిధి చెక్ బౌన్స్...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి జారీ అయిన చెక్ బౌన్స్ అయింది. సంబంధిత ఖాతాలో తగినంత నిధులు లేవన్న కారణంగా బ్యాంకు సిబ్బంది ఈ చెక్‌ను బౌన్స్ చేశారు. 
 
సాధారణంగా సీఎం రిలీఫ్ ఫండ్ అంటే ఆషామాషీ కాదు. ప్రభుత్వానికి సంబంధించి ఏ విభాగంలోనైనా నిధుల కొరత ఉండొచ్చేమో కానీ.. సీఎం సహాయ నిధి పద్దులో మాత్రం కొరత ఉండదు. ఇది అత్యవసర పద్దు కిందకు వస్తుంది. టీడీపీ సర్కారు పుణ్యమాని ప్రస్తుతం ఆ పద్దులోనూ నిధులు ఖాళీ అయ్యాయి. 
 
ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఈ పద్దును సైతం ఖాళీ చేసి నిధులను ఇతర పథకాలకు మళ్లించారు. ఫలితంగా అనారోగ్యం బారినపడిన వారికి మంజూరు చేసిన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు బౌన్స్‌ అవుతున్నాయి. ఎన్నికల ముందు లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు ఇవ్వగా.. ఆ పద్దులో సొమ్ము లేకపోవడంతో బ్యాంకర్లు తిప్పి పంపిస్తున్నారు. 
 
తాజాగా, కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గ పరిధిలోని నాగిరెడ్డి రెవెన్యూ కాలనీకి చెందిన జ్యోతి పేరిట ఇచ్చిన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కును ‘ఇన్‌సఫీషియంట్‌ ఫండ్స్‌’ అని పేర్కొంటూ బ్యాంక్‌ అధికారులు వెనక్కి ఇచ్చారు.
 
కర్నూలు జిల్లా రెవెన్యూ కాలనీకి చెందిన గంగాధర్‌ రెడ్డి భార్య జ్యోతికి 2018 నవంబర్‌లో తీవ్ర కడుపు నొప్పి రావటంతో కర్నూలులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు ఆమెకు అత్యవసరంగా ఆపరేషన్‌ చేయించాలని సూచించారు. ఆ కుటుంబానికి ఆరోగ్యశ్రీ సదుపాయం లేకపోవడంతో అప్పు తెచ్చి ఆపరేషన్‌ చేయించారు. మొత్తంగా రూ.56 వేలు ఖర్చయ్యింది. 
 
సహాయం కోసం పాణ్యం టీడీపీ ఇన్‌చార్జి ఏరాసు ప్రతాప్‌రెడ్డి ద్వారా నవంబర్‌ 26న సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు దరఖాస్తు చేసుకున్నారు. రూ.26,920 మంజూరు చేస్తున్నట్టు ఈ ఏడాది మార్చి 15న సమాచారం వచ్చింది. 
 
ఎన్నికల పోలింగ్‌కు రెండు రోజుల ముందు ఏప్రిల్‌ 9వ తేదీన ఏరాసు ప్రతాప్‌రెడ్డి బాధిత కుటుంబానికి సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కును అందించారు. 10వ తేదీన చెక్కును బ్యాంక్‌లో సమర్పించగా.. 15వ తేదీన ఆ పద్దులో నిధులు లేవని బ్యాంక్‌ అధికారులు లిఖిత పూర్వకంగా సమాచారం ఇచ్చారు. దీంతో ఆ దంపతులు ఒక్కసారి షాకయ్యారు.