1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 19 ఫిబ్రవరి 2016 (14:46 IST)

టీడీపీ గూటికి భూమా నాగిరెడ్డి .. భూమా అఖిల... ఒకరికి మంత్రిపదవి?

కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. ఈ జిల్లాలో జగన్ మోహన్ రెడ్డికి కుడిభుజంగా ఉన్న భూమా నాగిరెడ్డి, ఆయన కుమార్తె భూమా అఖిల ప్రియా రెడ్డి అతి త్వరలోనే తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. వీరిద్దరితో పాటు కర్నూలు జిల్లాకే చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా సైకిల్ ఎక్కవచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందుకోసం టీడీపీ నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించినట్టు వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. 
 
పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారనీ, వారంతా తమ పార్టీలో చేరితో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలోని టీడీపీ సర్కారును తొక్కేస్తామంటూ జగన్ మోహన్ రెడ్డి తాజాగా ప్రకటించారు. జగన్ అలా ప్రకటించారో లేదో.. టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్‌కు భూమా నాగిరెడ్డి, ఆయన కుమార్తె అఖిల ప్రియా రెడ్డి ఆకర్షితులైనట్టు తెలుస్తోంది. 
 
టీడీపీలో చేరే వీరిద్దరిలో ఒకరికి మంత్రి పదవిని ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఆ ఒప్పందంపైనే వారిద్దరు జగన్‌ మోహన్‌ రెడ్డికి షాక్ ఇచ్చి.. టీడీపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. ఇదే అంశంతో పాటు.. తమ రాజకీయ భవిష్యత్‌పై చర్చించేందుకు భూమా నాగిరెడ్డి శుక్రవారం సాయంత్రం తన ముఖ్య అనుచరులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.