ఆదివారం, 29 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 18 ఏప్రియల్ 2023 (17:27 IST)

వివేకా హత్య కేసు : భాస్కర్ రెడ్డికి షాక్ - అవినాష్ రెడ్డికి ఊరట

YS Avinash Reddy
మాజీ మంత్రి వైఎస్.వివేకానంద రెడ్డి హత్య కేసులో అరెస్టు అయిన వైఎస్ భాస్కర్ రెడ్డికి షాక్ తగిలింది. మరోవైపు, ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టు భయంతో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన కడప వైకాపా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి భారీ ఊరట లభించింది. ఈ నెల 25వ తేదీ వరకు ఆయన్ను అరెస్టు చేయొద్దని సీబీఐను హైకోర్టు ఆదేశించింది. 
 
మరోవైపు, వివేకా హత్య కేసులో అరెస్టు చేసిన వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలకు ఆరు రోజుల కష్టడీ విధించింది. ఆ మేరకు వారిద్దరి కస్టడీ సీబీఐకి అనుమతి ఇచ్చింది. వివేకా హత్యకు భాస్కర్ రెడ్డి నెల రోజుల క్రితమే కుట్ర పన్నారని, అందుకోసం రూ.40 కోట్లను సిద్ధం చేసుకున్నారని తెలిపారు. అందులో రూ.నాలుగు కోట్లు చేతులు మారాయని సీబీఐ అధికారులు కోర్టుకు తెలిపారు. 
 
భాస్కర్ రెడ్డి సమాజంలో పలుకుబడి వున్న వ్యక్తి అని దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయని, పైగా అతడు విచారణలో సరైన సమాధానాలు ఇవ్వడం లేదని సీబీఐ అధికారులు వివరించారు. అందుకే అతడిని అరెస్టు చేశామని, కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని కోర్టుకు తెలిపారు. దీంతో వారిద్దరినీ కోర్టు కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీచేసింది.
 
ఇదిలావుంటే, ఇదే కేసులో కడప ఎంపీగా ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డిని ఈ నెల 25వ తేదీ వరకు అరెస్టు చేయొద్దని కోర్టు ఆదేశించింది. అవినాష్ విచారణకు సంబంధించి వీడియో, ఆడియో రికార్డింగ్ చేయాలని స్పష్టం చేసింది. 25వ తేదీ వరకు అవినాష్ రెడ్డి రోజూ విచారణకు హాజరుకావాలని సూచించింది. ఆ రోజున ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తుది తీర్పును వెలువరిస్తామని పేర్కొంది. 
 
కాగా, అవినాశ్ రెడ్డి అరెస్ట్ భయంతో తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ పిటిషన్ పైన న్యాయమూర్తి వాదనలు ఆలకించారు. మంగళవారం వాడిగా, వేడిగా వాదనలు జరిగాయి. ఇరువైపుల వాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి తుది తీర్పు వచ్చే వరకు అరెస్టు చేయవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు.