శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 26 మార్చి 2023 (21:44 IST)

రాపాక అమ్ముడు పోయిన సరకు... రూ.10 కోట్లా? రూ.10 వేలే ఎక్కువ : బొండా ఉమ

bonda uma
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నేతలను తనను సంప్రదించి టీడీపీ అభ్యర్థిగా ఓటు వేయాల్సిందిగా డబ్బు ఆఫర్ చేశారంటూ జనసేన పార్టీ టిక్కెట్‌పై గెలిచి వైకాపా పంచన చేరిన రాపాక వరప్రసాద్ చేసిన ఆరోపణలపై టీడీపీ సీనియర్ నేత బొండా ఉమ ఘాటుగా స్పందించారు. "రాపాక ఇప్పటికే అమ్ముడు పోయిన సరుకు. నిన్ను ఆల్రెడీ కొనేశారు నాయనా... దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్‌టు వైకాపా" అని బోర్డు ఉందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అందువల్ల "నువ్వుగానీ, నీలాంటి వైకాపా ఎమ్మెల్యేలు కానీ టీడీపీకి ఎందుకు.. దీనిపై సూటిగా సమాధానం చెప్పు" అంటూ రాపాకను ఆయన నిలదీశారు. 
 
తాడేపల్లి ప్యాలెస్ నుంచిన స్క్రిప్టునే రాపాక చదివారని బొండా ఉమ ఆరోపించారు. రాపాక ఓ చిల్లర మనిషి అని, జనసేన పార్టీ టిక్కెట్‌పై గెలిచి వైకాపాకు అమ్ముడు పోయారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాంటి వ్యక్తి ఇవాళ నీతులు చెబుతున్నాడంటూ మండిపడ్డారు. పైగా, రాపాకను కొనాల్సిన అవసరం టీడీపీకి లేదన్నారు. టీడీపీకి కావాల్సిన 23 ఓట్లు స్పష్టంగా ఉన్నాయని బొండా ఉమ పేర్కొన్నారు. రాపాకను రూ.10 కోట్లు పెట్టి కొనేది ఎవరు అని, అతడికి రూ.10 వేలు కూడా ఎక్కువేనని బొండా ఉమ ఎద్దేవా చేశారు.