1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 1 జులై 2024 (16:03 IST)

ప్రజలు చిత్తుగా ఓడించినా సరే మూడు రాజధానులకే కట్టుబడివున్నాం : బొత్స సత్తిబాబు

botsa
గత సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీకి ఓటర్లు తగిన గుణపాఠం చెప్పినప్పటికీ తాము మాత్రం మూడు రాజధానుల నిర్ణయానికి కట్టుబడివున్నట్టు వైకాపా సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మరోమారు పునరుద్ఘాటించారు. విజయనగరంలో వైసీపీ కార్యాలయాన్ని అదితి గజపతిరాజు సందర్శించడాన్ని తప్పుబట్టిన నేత బొత్స.... తాము మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని, ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. 
 
గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి మూడు రాజధానులు నిర్మిస్తామని ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ ప్రకటించారు. విశాఖను కార్యనిర్వాహక రాజధానిని చేస్తామని చెప్పారు. అయితే, ఐదేళ్లు గడిచినా రాష్ట్రం ఒక్క రాజధానికి కూడా నోచుకోలేకపోయింది. తాజా ఎన్నికల్లో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చింది. వచ్చీ రాగానే మళ్లీ అమరావతే అమరావతిలో పడకేసిన పనులను తిరిగి ప్రారంభించారు. ప్రస్తుతం అక్కడ మళ్లీ జోరుగా పనులు జరుగుతున్నాయి.
 
ఈ నేపథ్యంలో రాజధాని విషయంలో తమ వైఖరి ఏంటో వైసీపీ మరోమారు స్పష్టం చేసింది. ఆదివారం విజయనగరంలో విలేకరులతో మాట్లాడిన బొత్స సత్యనారాయణ ఇప్పటికీ తాము మూడు రాజధానులకే కట్టుబడి ఉంటామన్నారు. అదే తమ పార్టీ విధానమని పునరుద్ఘాటించారు. కాగా, ఇటీవల విజయనగరంలో వైసీపీ కార్యాలయాన్ని టీడీపీ ఎమ్మెల్యే అదితి గజపతిరాజు పరిశీలించడాన్ని బొత్స తప్పుబట్టారు.