శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 27 మే 2021 (20:13 IST)

ఓటుకు నోటు కేసు : చంద్రబాబుకు రిలీఫ్... రేవంత్‌కు కష్టాలు

తెలంగాణ రాష్ట్రంలో వెలుగు చూసిన ఓటుకు నోటు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు రిలీఫ్‌ దొరికింది. ఈడీ చార్జ్‌షీట్‌లో చంద్రబాబు పేరు కనిపించలేదు. ఓటుకు నోటు కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గురువారం ఎంపీ రేవంత్‌రెడ్డిపై చార్జ్‌షీట్ దాఖలు చేసింది. 
 
ఏసీబీ గతంలో దాఖలు చేసిన చార్జ్‌షీట్‌ ఆధారంగా ఎంపీ రేవంత్‌పై మనీలాండరింగ్‌ కేసు నమోదు చేసింది. అయితే ఈ చార్జ్‌షీట్‌లో చంద్రబాబు పేరు లేకపోవడంతో టీడీపీ అధినేతకు ఓటుకు నోటు కేసులో ఉపశమనం కలిగింది.
 
 
ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రేవంత్‌ రెడ్డి 50 లక్షలు ఇచ్చినట్టు ఏసీబీ తన చార్జ్‌షీట్‌లో పేర్కొన్న విషయం తెలిసిందే. మండలి ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌ చేసే విధంగా.. ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో రాయబారం నడిపినట్టుగా రేవంత్‌ రెడ్డిపై చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. 
 
వేం నరేందర్‌రెడ్డికి ఓటు వేయాల్సిందిగా ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను ప్రలోభాలకు గురిచేశారని ఏసీబీ అభియోగం మోపింది. ఈడీ తాజాగా దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో ఎంపీ రేవంత్‌రెడ్డితో పాటు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను కూడా నిందితుడిగా పేర్కొంది. ఈ మేరకు ఈడీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్టు పెట్టింది.