1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 14 జనవరి 2024 (12:42 IST)

భవిష్యత్తు మనదే.. అమరావతి కేంద్రంగానే రాజధాని ఉంటుంది - టీడీపీ అధినేత చంద్రబాబు

pawan - sankranti - babu
అమరావతి రాజధాని గ్రామం మందడంలో భోగి వేడుకల్లో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లు పాల్గొన్నారు. అధిక ధరలు, నిరుద్యోగం, ప్రభుత్వ పెత్తందారీ పోకడలు, రాజకీయ హింస వంటి పలు అంశాలతో తయారు చేసిన ప్లకార్డులను భోగి మంటల్లో వేసిన ఇరువురు నేతలు. తెలుగు జాతికి స్వర్ణయుగం కోసం సంక్రాంతి సంకల్పం తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రజలకు పిలుపు ఈ సందర్భంగా చంద్రబాబు రాష్ట్ర ప్రజానీకానికి పిలుపునిచ్చారు 
 
మరోవైపు, టీడీపీ అధినేత నారా చంద్రబాబు స్వగ్రామమైన నారావారిపల్లె సంక్రాంతి సంబరాలకు సిద్ధమైంది. ఏటా సంక్రాంతి రోజుల్లో నారా, నందమూరి కుటుంబసభ్యులు ఇక్కడికి చేరుకొని పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. నారా భువనేశ్వరి, మనవడు దేవాన్షా, నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర, వారి చిన్న కుమార్తె తేజస్విని, నందమూరి రామకృష్ణ, కంఠమనేని శ్రీనివాస్, లోకేశ్వరి, ఇందిర తదితర కుటుంబసభ్యులు శుక్రవారమే గ్రామానికి చేరుకున్నారు. 
 
ఆదివారం భోగి సంబరాల్లో పాల్గొంటారు. అనంతరం గ్రామంలోని మహిళలకు నిర్వహించే ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాల విజేతలకు నారా భువనేశ్వరి బహుమతులను అందజేస్తారు. చంద్రబాబు ఆదివారం మధ్యాహ్నం హెలికాప్టరులో ఇక్కడికి చేరుకుంటారని, అందుకోసం హెలిప్యాడ్ సిద్ధం చేశామని చంద్రగిరి నియోజకవర్గ తెదేపా ఇన్‌చార్జి పులివర్తి నాని తెలిపారు. 
 
సాయంత్రానికి లోకేశ్, బ్రాహ్మణి వస్తారని ఆయన వెల్లడించారు. ఈసారి సందర్శకుల తాకిడి అధికంగా ఉండటంతో వారికి భోజన వసతి, వాహనాల పార్కింగ్ కోసం స్థల కేటాయింపుతోపాటు అన్ని రకాల ఏర్పాట్లూ చేస్తున్నట్లు ఆయన వివరించారు.
 
నారావారిపల్లెకు చేరుకున్న నారా, నందమూరి కుటుంబ సభ్యులు శనివారం సమీపంలోని కల్యాణి జలాశయానికి వెళ్లి గంటపాటు సరదాగా గడిపారు. నారా దేవాన్జీతో పాటు నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర, తేజస్వి, నందమూరి రామకృష్ణ ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కట్ట దిగువన ఉన్న ప్రసన్న ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.