మంగళవారం, 2 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : గురువారం, 23 సెప్టెంబరు 2021 (08:14 IST)

సొంత బ్రాండ్లు తెచ్చి మందుబాబులను పీల్చిపిప్పి చేస్తున్నారు: చంద్రబాబు

నాసిరకం మద్యంతో సొంత బ్రాండ్లు తెచ్చి మందుబాబులను ఆర్థికంగా, శారీరకంగా పీల్చిపిప్పి చేస్తున్నారని టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. రాష్ట్రంలో జోరుగా డ్రగ్స్‌ అక్రమ రవాణా జరుగుతోందని, ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి రూ.వేల కోట్లు దిగుమతి అవుతున్నాయని టిడిపి ఆరోపించారు. డ్రగ్స్‌ వ్యాపారానికి గేట్లు ఎత్తి సంఘ వ్యతిరేక శక్తులు, టెర్రరిస్టు సంస్థలను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు.

ముఖ్యమంత్రి ఇంటి సమీపంలో టాల్కమ్‌ పౌడర్‌ కంపెనీ పేరుతో రూ.21 వేల కోట్ల హెరాయిన్‌ పట్టుబడిందన్నారు. దీనికి ముఖ్యమంత్రి, డిజిపి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. జగన్‌ పాలనలో వ్యవసాయ రంగం సంక్షోభంలో పడిందని విమర్శించారు.

ప్రభుత్వం నుంచి సాయం అందక అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఎరువులు, విత్తనాల కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వైసిపి పాలనలో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కు వెళ్లిందని, ఉపాధి, పెట్టుబడులు లేవన్నారు. రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టి భావితరాల భవిష్యత్‌ను ప్రశ్నార్థకం చేశారని విమర్శించారు.