శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 23 సెప్టెంబరు 2021 (08:00 IST)

సిద్ధూ ప్రమాదకారి... ముఖ్యమంత్రిని కానివ్వను : అమరీందర్ సింగ్

పంజాబ్‌ పీసీసీ అధ్యక్షుడు నవ్‌జ్యోత్‌ సింగ్‌ సిద్ధూపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. సిద్ధూను అత్యంత ప్రమాదకారితో పోల్చిన అమరీదర్.. సిద్ధూను మాత్రం పంజాబ్ ముఖ్యమంత్రిని కానివ్వబోనని స్పష్టం చేశారు. పనిలోపనిగా కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంకలను అనుభవం లేని నేతలుగా ఆయన అభివర్ణించారు. 
 
పంజాబ్‌ సీఎంగా పనిచేసిన అమరీందర్‌ ఇటీవల రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. పలు ముఖాముఖి కార్యక్రమాల్లో ఆయన మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సిద్ధూపై గట్టి అభ్యర్థిని నిలబెడతానన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సిద్ధూని ముఖ్యమంత్రిని కానివ్వకుండా పోరాడతానన్నారు.
 
'అతనో ‘డ్రామా మాస్టర్‌’. కొత్త ముఖ్యమంత్రితో తానే ఓ ‘సూపర్‌ సీఎం’ అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇలాంటి ప్రమాదకర వ్యక్తి నుంచి దేశాన్ని కాపాడేందుకు ఎలాంటి త్యాగానికైనా సిద్ధమే' అని సిద్ధూని ఉద్దేశించి అమరీందర్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.