శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 28 సెప్టెంబరు 2020 (11:32 IST)

బాలు పేరుతో సంగీత విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పాలి : చంద్రబాబు విజ్ఞప్తి

గానగంధర్వుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం పేరుతో నెల్లూరులో 'ఎస్పీబాలు మెమోరియల్ మ్యూజిక్ యూనివర్శిటీ'ని నెలకొల్పాలని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డికి ఓ లేఖ రాశారు. 
 
'అమృత గానంతో తెలుగు జాతి ఖ్యాతిని దశదిశలా వ్యాపింపజేసిన అమర గాయకుడు బాల సుబ్రహ్మణ్యం స్మృతిని సజీవంగా నిలపడం కోసం సంగీత విశ్వ విద్యాలయం నెలకొల్పి అందులో ఆయన కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలి. ఆ ప్రాంతాన్ని బాల సుబ్రహ్మణ్యం సంగీత కళా క్షేత్రంగా అభివృద్ధి చేయాలి. ప్రభుత్వ సంగీత అకాడమీకి ఆయన పేరు పెట్టడం ద్వారా సంగీతం, ఇతర లలిత కళల్లో యువతరాన్ని ప్రోత్సహించి బాల సుబ్రహ్మణ్యం కల నెరవేర్చాలి' అని ఆ లేఖలో చంద్రబాబు కోరారు. 
 
గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో బాపు, రమణల స్మృత్యర్థం రాజధాని అమరావతిలో ప్రపంచ స్థాయి కళాక్షేత్రం అభివృద్ధి చేయాలని అసెంబ్లీలో తీర్మానించామని, నరసాపురంలో బాపు కళాక్షేత్రం అభివృద్ధికి శ్రీకారం చుట్టడంతోపాటు విజయవాడలో పురావస్తు మ్యూజియానికి బాపు పేరు పెట్టామని, రాజమండ్రిలో గోదావరి తీరాన బాపు-రమణల విగ్రహాలను ప్రతిష్టించామని గుర్తుచేశారు.
 
విఖ్యాత సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాల మురళీకృష్ణ స్మృతిచిహ్నంగా రూ.10 లక్షలతో జాతీయ పురస్కారం ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. తెలుగు మహనీయుల స్మృతులను భావితరాలకు వారసత్వ సంపదగా అందించాలనే యోచనతో హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై ఎన్టీ రామారావు హయాంలో 33 మంది తెలుగు మహనీయుల విగ్రహాలను ప్రతిష్టించారని గుర్తుచేశారు. బాలు జయంతిని ఏటా రాష్ట్ర ప్రభుత్వ వేడుకగా నిర్వహించి, ఆయన పేరుతో రూ.10 లక్షల జాతీయ పురస్కారాన్ని అందించాలని కూడా చంద్రబాబు తన లేఖలో కోరారు.