1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 18 మార్చి 2021 (13:07 IST)

అసైన్డ్ భూముల ఆట : సీఐడీ నోటీసుపై హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్

నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం అసైన్డ్‌ భూములను కొనుగోలు చేసిన వ్యవహారంలో అక్రమాలు, అవినీతి చోటు చేసుకుందన్న అంశంలో సీఐడీ నమోదు చేసింది. ఈ కేసు విచారణ నిమిత్తం తమ కార్యాలయానికి రావాల్సిందిగా చంద్రబాబుకు సీఐడీ నోటీసు కూడా స్వయంగా ఇచ్చింది. ఈ క్రమంలో ఈ ఎఫ్‌ఐఆర్‌ను సవాల్‌ చేస్తూ తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు హైకోర్టులో క్వాష్ పిటిషన్‌ దాఖలు చేశారు. 
 
సీఐడీ ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు పిటిషన్‌లో కోరారు. చంద్రబాబు పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగే అవకాశముంది. అమరావతి అసైన్డ్‌ భూముల వ్యవహారంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు... ఎస్సీ ఎస్టీలపై వేధింపుల నిరోధ చట్టం కింద చంద్రబాబు మీద సీఐడీ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే. 
 
ఈ కేసులో ఈ నెల 23న విచారణకు హాజరుకావాలని సీఆర్‌పీసీలోని 41(ఏ)(1) ప్రకారం సీఐడీ నోటీసులిచ్చింది. నోటీసులో పేర్కొన్న అంశాలకు కట్టుబడి ఉండకపోయినా, విచారణకు హాజరు కాకపోయినా చట్ట ప్రకారం అరెస్టు చేయాల్సి ఉంటుందని అందులో పేర్కొంది. 
 
పైగా, ఈనెల 23న ఈ నెల 23న ఉదయం 11 గంటలకు విజయవాడలోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి విచారణకు రావాలని సీఐడీ సైబర్‌ సెల్‌ విభాగం డీఎస్పీ ఎ.లక్ష్మీనారాయణ పేరిట ఈ నోటీసులు జారీ అయ్యాయి. దీంతో చంద్రబాబు హైకోర్టులో క్యాష్ పిటిషన్‌ను దాఖలు చేశారు.
 
ఇదిలావుంటే, ఆరు రోజుల కిందట సీఐడీ కేసు నమోదు చేయగా.. ఆ ఎఫ్‌ఐఆర్‌ మంగళవారం వెలుగుచూసింది. ఐపీసీలోని 166, 167, 217, 120 (బీ) రెడ్‌ విత్‌ 34, 35, 36, 37, ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టంలోని సెక్షన్‌ 3(1)(ఎఫ్‌),(జీ), ఏపీ అసైన్డ్‌ భూముల బదిలీ నిరోధక చట్టంలోని సెక్షన్‌ 7 ప్రకారం కేసులు నమోదు చేసింది. 
 
ఈ ఎఫ్‌ఐఆర్‌లలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఏ1గా, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మాజీ మంత్రి పి.నారాయణను ఏ2గా పేర్కొంది. ఇతర అధికారులు నిందితులుగా ఉన్నారని ఎఫ్‌ఐఆర్‌లో వివరించింది. వారి పేర్లు మాత్రం ప్రస్తావించలేదు.