ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 25 ఏప్రియల్ 2021 (17:30 IST)

అకాల వర్షంతో రామాపురం మండలంలో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి

రెండు రోజులుగా మండలంలో కురిసిన అకాల వర్షాలకు నష్టపోయిన ప్రతి రైతునూ  ఆదుకుంటామని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డిఅన్నారు. రామాపురం మండలంలోని రాచపల్లె, సరస్వతిపల్లి, బాలిరెడ్డి గారిపల్లి, నల్లగుట్టపల్లి, సుద్దమలలలో రెండు రోజులుగా కురిసిన గాలివానకు దెబ్బతిన్న పంటలను శనివారం ఆయన రైతులు, వ్యవసాయ శాఖ అధికారులుతో కలసి పరిశీలించారు.

దెబ్బతిన్న పంటలను చూసి ఆయన చలించిపోయారు. అనంతరం రైతులను ఉద్దేశించి శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ మండలంలో కురిసిన వడగండ్ల వానకు, గాలికి మామిడిచెట్లు, పొద్దుతిరుగుడు, వరిపంట, బొప్పాయి తదితర పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నష్టపోయిన ప్రతి రైతునూ  ప్రభుత్వం ఆదుకుంటుందని బాధిత రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సచివాలయంలో గ్రామ వ్యవసాయ కార్యదర్శి వద్ద నష్టపోయిన ప్రతి రైతు నమోదు చేసుకోవాలని సూచించారు.

రాచపల్లె గ్రామంలోని కొమ్మూరువాండ్లపల్లెకు చెందిన పెద్ద రెడ్డయ్య, చిన్న రెడ్డయ్య, పుష్పలత, రమేష్ రెడ్డిల మామిడి తోటలను,  కిషోర్ రాజు, వెంకటరమణ రాజు, ప్రమీల ప్రొద్దుతిరుగుడు  పంటలను ఆయన పరిశీలించారు. సుబ్బరాజు, చంద్రారెడ్డి సరోజమ్మలకు చెందిన బొప్పాయి తోటలను పరిశీలించి అనంతరం జెడి, వ్యవసాయ కమిషనర్లకు క్షేత్ర స్థాయి నుండి ఫోన్లో  పంట నష్టాలను ఆయన వివరించారు.

పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏవో నాగమణి, వ్యవసాయ సిబ్బంది, సర్పంచిలు వెంకటరెడ్డి, నాగభూషణ్ రెడ్డి, జడ్పిటిసి అభ్యర్థి మాసన వెంకటరమణ సింగల్ విండో అధ్యక్షులు పెద్ధిరెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు ఆదినారాయణరెడ్డి, వెంకట్రామిరెడ్డి, నాగబసిరెడ్డి, లోకేష్, ప్రవీణ్ రాచపల్లి యువ నాయకుడు గణేష్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.