1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 3 ఆగస్టు 2021 (16:16 IST)

అనంతపురంలో చీటీలు, డిపాజిట్లు: రూ.45 కోట్లతో పరారైన మహిళ

చీటీలు నిర్వహించడం, అధిక వడ్డీకి డిపాజిట్లు (మైక్రో ఫైనాన్స్‌ మాదిరి) చేసుకోవడం ఆమె వృత్తి. డిపాజిట్‌ చేసుకొన్న నగదుకు మూడేళ్లకు రెట్టింపు మొత్తం ఇచ్చేది. డబ్బుకు ఆశ పడిన ఎంతో మంది ఆమె వద్ద నగదు జమ చేశారు. కొవిడ్‌ కారణంగా తమ డబ్బు తిరిగి చెల్లించాలని డిపాజిట్‌దారులు ఒత్తిడి తేగా సదరు మహిళ రూ.45 కోట్లతో పరారైంది.

వివరాలు.. అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలోని సత్యనారాయణ పేట కేంద్రంగా విజయలక్ష్మి అనే మహిళ ఎలాంటి అనుమతులు లేకుండా అధిక వడ్డీలు, చీటీల వ్యాపారం చేస్తున్నారు. 20 ఏళ్లుగా ఆమె ఈ వ్యవహారం కొనసాగిస్తున్నారు. ఈమె వద్ద 20 మందికి పైగా ఏజెంట్లు, అకౌంటెట్లు పని చేస్తున్నారు.
 
వీరు హిందూపురం, పెనుకొండ, గోరంట్ల, బాగేపల్లి, గౌరిబిదనూరు, పావగడ ప్రాంతాల్లో నగదు సేకరించడం, తిరిగి చెల్లిస్తుండటంతో ప్రజలకు నమ్మకం ఏర్పడింది. రెండు దశాబ్దాలుగా నమ్మకంగా ఉండటంతో తమ సొమ్ములకు భద్రత ఉంటుందని నమ్మిన వారు రూ.లక్షల్లో డిపాజిట్‌ చేశారు. కొవిడ్‌ వల్ల ఆర్థిక పరిస్థితులు అనుకూలించక తమ డబ్బులు తిరిగి చెల్లించాలని బాధితులు ఏజెంట్లపై ఒత్తిడి చేశారు.
 
కొవిడ్‌ సాకు చూపి వాయిదా వేసుకొంటూ వచ్చిన నిర్వాహకురాలు ఒత్తిడి భరించలేక పది రోజుల కిందట ఇల్లు వదిలి పరారైంది. దీంతో డబ్బు డిపాజిట్‌ చేసిన వారు సోమవారం ఏజెంట్లపై దాడికి పాల్పడ్డారు. మొత్తం 1600 మందికి చెందిన రూ.45 కోట్లతో ఆమె పరారైంది. ఈ విషయమై హిందూపురం రెండో పట్టణ సీఐ మన్సూరుద్దీన్‌ను వివరణ కోరగా నగదు మోసాలపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.