ఆదివారం, 8 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 21 ఫిబ్రవరి 2022 (16:59 IST)

గౌతం రెడ్డి భౌతికయాన్ని చూసి సీఎం జగన్ భావోద్వేగం - సతీమణితో కన్నీటి నివాళి

ఏపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి భౌతికకాయానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన సతీమణి భారతితో కలిసి కన్నీటి నివాళులు అర్పించారు. ముఖ్యగా, తన సహచరుడు, కేబినెట్ మంత్రి గౌతం రెడ్డి భౌతికకాయాన్ని చూడగానే సీఎం జగన్ భావోద్వేగానికి గురయ్యారు. అలాగే, సీఎం జగన్‌ను చూడగానే మేకపాటి గౌతం రెడ్డి కుటుంబం బోరున విలపించింది. 
 
ఏపీ మంత్రి గౌతం రెడ్డి సోమవారం ఉదయం గుండెపోటు కారణంగా హఠాన్మరణం చెందిన విషయం తెల్సిందే. ఈ మరణ వార్త తెలియగానే ఆయన ప్రత్యేక విమానంలో బెంగుళూరుకు చేరుకున్నారు. అక్కడ తన భార్యను వెంటబెట్టుకుని హైదరాబాద్ నగరానికి చేరుకుని, జూబ్లీహిల్స్‌లోని మేకపాటి గౌతం రెడ్డి నివాసానికి చేరుకుని కన్నీటి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా అక్కడి మేకపాటి కుటుంబ సభ్యుల రోదనలు ప్రతి ఒక్కరినీ కలిచివేశాయి. 
 
సీఎం జగన్‌ను చూడగానే గౌతం రెడ్డి తల్లి బోరున విలపించారు. గౌతం రెడ్డి సతీమణి, ఆయన తండ్రి, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డిలు కూడా కన్నీటి పర్యంతమయ్యారు. తనను చూసిన గౌతం రెడ్డి కుటుంబ సభ్యులు బోరున విలపించడాన్ని  చూసిన జగన్ కూడా భావోద్వేగానికి లోనయ్యారు. గౌతం పార్ధివదేహం పక్కనే కుర్చీలో కూర్చొన్న జగన్ కన్నీరుకార్చారు. అలాగే, తన పక్కనే కూర్చొన్న మేకపాటి రాజమోహన్ రెడ్డిని సీఎం జగన్ ఓదార్చారు.