1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 21 ఫిబ్రవరి 2022 (11:43 IST)

ఏపీ మంత్రి గౌతం రెడ్డి హఠాన్మరణం - తెలంగాణ నేతల సంతాపం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రి మేకపాటి గౌతం రెడ్డి సోమవారం హఠాన్మరణం చెందారు. ఆయన తీవ్రగుండెపోటుకు గురికావడంతో ఆయన్ను హైదరాబాద్ అపోలో ఆస్పత్రికి తరలించారు. కానీ ఆయన అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్థారించారు. అయితే, మేకపాటి గౌతం రెడ్డి మృతిపట్ల తెలంగాణ మంత్రులు, నేతలు తీవ్ర దిగ్భ్రాంతితో పాటు తమ సంతాపాలను తెలిపారు. 
 
గౌతం రెడ్డి మృతి చెందారన్న వార్త తెలుసుకుని దిగ్భ్రాంతికి గురైనట్టు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడుని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. 
 
ఇకపోతే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా సంతాపం తెలిపారు. మంచి రాజకీయ భవిష్యత్ ఉన్న నేత మరణం తమను కలిచివేసిందన్నారు. గౌతం రెడ్డి ఆత్మకు శాంతిచేకూరాలని దేవుడుని ప్రార్థిస్తున్నట్టు ట్వీట్ చేశారు. 
 
తన ప్రియ మిత్రుడు మేకపాటి గౌతం రెడ్డి ఇకలేరన్న వార్త దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్. షర్మిల అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్టు షర్మిల ట్వీట్ చేశారు.