ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 21 ఫిబ్రవరి 2022 (14:25 IST)

23న గౌతం రెడ్డి అంత్యక్రియలు - అపోలో వైద్యులు స్టేట్మెంట్ రిలీజ్

తీవ్రమైన గుండెపోటుతో సోమవారం హఠాన్మరణం చెందిన ఏపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి అంత్యక్రియలు బుధవారం జరుగనున్నాయి. అదేసమయంలో ఆయన మృతికి సంతాపసూచకంగా ఏపీ ప్రభుత్వం రెండు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది. 
 
ప్రస్తుతం గౌతం రెడ్డి మృతదేహాన్ని హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి తరలించారు. అక్కడ రాజకీయ నేతలు, అభిమానుల సందర్శనార్థం సోమవారం సాయంత్రం వరకు ఉంచుతారు. ఆ తర్వాత గౌతం రెడ్డి మృతదేహాన్ని నెల్లూరు జిల్లాలోని ఆయన స్వగ్రామమైన మర్రిపాడు మండలంలోని బ్రాహ్మణపల్లికి తీసుకొస్తారు. 
 
అయితే, గౌతంరెడ్డి కుమారుడు అర్జున్ రెడ్డి అమెరికాలో ఉన్నారు. ఆయన మంగళవారం సాయంత్రానికి స్వగ్రామానికి చేరుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత అంటే బుధవారం ఏపీ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో గౌతం రెడ్డి అంత్యక్రియలు నిర్వహిస్తారు. 
 
ఇదిలావుంటే గౌతం రెడ్డి మరణంపై హైదరాబాద్ అపోలో ఆస్పత్రి వైద్యులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంటి వద్ద గౌతం రెడ్డి కుప్పకూలారని, ఉదయం 7.45 గంటలకు అపోలో ఆస్పత్రికి తీసుకొచ్చారని పేర్కొన్నారు. 
 
స్పందించని స్థిలో ఆయనను ఆస్పత్రికి తీసుకొచ్చారని, అప్పటికే ఆయనకు శ్వాస ఆడటం లేదని చెప్పారు. ఐసీయులో వైద్య బృందం తీవ్రంగా శ్రమించినప్పటికీ ఫలితం లేకపోయిందని, ఉదయం 9.16 గంటలకు ఆయన కన్నుమూశారని వెల్లడించారు.