శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 16 జులై 2019 (15:22 IST)

ఇంటి స్థలం లేనిపేదవాడు ఉండకూడదు : సీఎం జగన్

వచ్చే ఉగాది నాటికి ఇంటి స్థలం లేని పేదవాడు ఉండకూడదు అని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలుజారీచేశారు. ఆయన మంగళవారం స్పందన కార్యక్రమంపై రివ్యూ ఇచ్చారు. ఉగాది నాటికి ఇంటి స్థలం లేని పేదవాడు ఉండకూడదన్నారు. 
 
గ్రామాన్ని యూనిట్‌గా తీసుకొని ప్రభుత్వ భూమి ఎంత ఉందో గుర్తించాలని, ఇళ్లులేని ప్రతి నిరుపేదకు ఇంటి స్థలం ఇవ్వాలన్నారు. కలెక్టర్ల ఫోకస్‌ లేకపోతే ఇది సాధ్యం కాదన్నారు. గ్రామ వాలంటీర్లు, సచివాలయాలు త్వరలో అందుబాటులోకి వస్తాయన్నారు. ఎంతమందికి ఇళ్లులేవో వీరిద్వారా లెక్కలు అందుతాయన్నారు. 
 
ప్రభుత్వ భూమి లేకపోతే భూమిని కొనుగోలు చేయాలన్నారు. ప్రతి ఎకరాలో రోడ్లు మౌలిక సదుపాయాలపోను ఎకరాకు సెంటన్నర చొప్పున 40 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నారు. ఎంత భూమి అవసరమవుతుందో గుర్తించండి అని చెప్పారు. ఉగాదినాటికి ఇళ్ల స్థలాల పంపిణీ పూర్తికావాలన్నారు. 
 
 
ఇచ్చిన ఇళ్లస్థలం ఎక్కడ ఉందో లబ్ధిదారునికి తెలియని పరిస్థితి ఉండకూడదన్నారు. హౌసింగ్‌ కోసం రూ.8,600 కోట్లు పెట్టామన్నారు. చరిత్రలో ఎప్పుడూలేని విధంగా ఇన్ని లక్షల సంఖ్యలో ఇళ్లస్థలాలు ఒకేసారి ఇస్తున్నామన్నారు. కలెక్టర్ల మీదే నా విశ్వాసం, నా బలం కూడా మీరేనని చెప్పారు. 
 
మీరు చిత్తశుద్ధితో చేస్తే.. ఈ కార్యక్రమం ఖచ్చితంగా చేయగలుగుతామన్నారు. వచ్చే తరాలు కూడా మీ గురించి జిల్లాల్లో మాట్లాడుకుంటాయన్నారు. ఇవ్వాళ్టి నుంచే మీరు చేయడం మొదలుపెడితే గాని ఉగాదినాటికి చేయలేరన్నారు. 
ప్రతి గ్రామాన్ని యూనిట్‌గా తీసుకోవాలని లబ్దిదారుల జాబితాను గ్రామ సెక్రటేరియట్లో పెట్టాలని జగన్ మోహన్ రెడ్డి కోరారు.