గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : సోమవారం, 12 ఆగస్టు 2019 (18:12 IST)

జయహో పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం వైయస్‌.జగన్‌

పుస్తకాన్ని రచించిన సీనియర్‌ పాత్రికేయుడు కె.రామచంద్రమూర్తి రచించిన జయహో పుస్తకాన్ని ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్ రెడ్డి సోమవారం ఆవిష్కరించారు. ఇందులో ‘‘ది ప్రింట్‌’’ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్, పద్మభూషణ్‌ శేఖర్‌ గుప్తా, ఎమెస్కో విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, సీఎంగా బాధ్యతలు చేపట్టి 2 నెలలు దాటిందన్నారు. ప్రజలు నామీద ఉంచిన నమ్మకాన్ని వమ్ముకానీయకూడదని ప్రతిక్షణం ఆలోచిస్తూ ఆదిశగా పాలన సాగిస్తున్నట్టు చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోను రాజకీయ పార్టీలు పేజీలకు పేజీలు ముద్రిస్తాయి. వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మాత్రం రెండు పేజీల్లో ప్రజలకిచ్చిన హామీలతో రూపొందించాం. మేనిఫెస్టోలో ప్రతిహామీని అమలుచేసే దిశగా ప్రయత్నం చేస్తున్నట్టు పేర్కొన్నారు. 
 
 
19 బిల్లులు ఒకే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టిన ఘనత ఈ ప్రభుత్వానికే చెందుతుందన్నారు. జగన్‌ విన్నాడు జగన్‌ ఉన్నాడు అని ప్రజలు అనుకున్న మాటను నిజం చేసేలా ముందుకు వెళ్తున్నాం. పాదయాత్ర గురించి నేను పుస్తకం రాస్తున్నాను, ఆవిష్కరించాలి అన్నప్పుడు నా మీద రాసిన పుస్తకాన్ని నేను ఆవిష్కరించడం బాగోదన్నాను. 
కానీ 3600 కిలోమీటర్లకుపైగా నడిచింది మీరు, 14 నెలలు రోడ్డుమీద ఉండి ప్రజలను పలకరించింది మీరే అని రామచంద్రమూర్తి అన్నారు. నిజంగానే పాదయాత్ర అన్నది ఒక గొప్ప అనుభవమన్నారు. 
 
నేను పాదయాత్రలో 3600 కిలోమీటర్లుకుపైగా నడిచానా? అని అనుకున్నప్పుడు గొప్ప ఉత్తేజం కలుగుతుంది. హైదరాబాద్‌ నుంచి దుబాయ్‌ 3000 కిలోమీటర్లు అయితే.. పాదయాత్రలో 3648 కిలోమీటర్లు అంత కంటే ఎక్కువే నడిచామని మా ఎంపీ బాలశౌరి నాతో అన్నారు. మళ్లీ అలాంటి పాదయాత్ర మళ్లీ చేయగలుగుతామా? అనుకున్నప్పుడు అది ఒక ప్రశ్నగానే నాకు అనిపిస్తుంది. గ్రామాల్లోకి వెళ్లి ప్రజలను కలవడం అన్నది పాదయాత్రలో ముఖ్యమైన పని. పాదయాత్రలో నేను ఎక్కడ పడుకుంటానో ప్రజలకు తెలుసన్నారు. 
 
 
రోడ్డు పక్కనే రాత్రికి చిన్న టెంటులో పడుకునేవాడిని. మరలా ఉదయం అంతా నడక. రోజంతా ప్రజల సమస్యలను తెలుసుకుంటూ మరలా రాత్రికి ఏదో ఒక ఊరిలో టెంటులో రాత్రి నిద్రపోయేవాడిని. జగన్‌ వచ్చాడు.. మమ్మల్ని కలుస్తాడు... మా కష్టాలు చెప్పుకుంటామంటూ ప్రజలు వచ్చేవారు. జగన్‌ మా కష్టాలు విన్నాడు, దేవుడు ఆశీర్వదిస్తే వాటిని తీరుస్తాడు అన్న నమ్మకమే ఒక ఉప్పెనైంది, అదే ఓటుగా మారింది.

ఆ 3648 కిలోమీటర్లు యాత్ర ప్రజలకు ధైర్యాన్నిచ్చింది. 50 శాతం ఓట్లతో  ప్రజలు రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేని విజయాన్ని అందించారు. యాభై శాతం మంది ప్రజలు ఈ వ్యక్తికి ఓటేస్తే తమకు మంచి జరుగుతుందని నమ్మేలా చేసింది. జగన్‌ విన్నాడు  జగన్‌ ఉన్నాడు అని ప్రజలు అనుకున్న మాటను నిజం చేసేలా ముందుకు వెళ్తున్నాం అని చెప్పుకొచ్చారు.