1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శనివారం, 2 అక్టోబరు 2021 (17:22 IST)

కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ మౌన ప్రదర్శన

బిజెపి ప్రభుత్వ  విధానాలకు నిరసనగా గాంధీ జయంతిని పురస్కరించుకుని శనివారం కాంగ్రెస్ పార్టీ అనంతపురంలో మౌన ప్రదర్శన నిర్వహించింది. బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించిన ఈ మౌన ప్రదర్శన లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ సాకే శైలాజనాథ్ పాల్గొన్నారు. గాంధీ జయంతి సందర్భంగా స్థానిక నాయకులు కాంగ్రెస్ అధ్యక్షులు బండ్లపల్లి ప్రతాపరెడ్డి, రాష్ట్ర మైనారిటీ చైర్మన్ దాదా గాంధీలు ఏర్పాటు చేసిన కార్యక్ర్రమంలో ఆయన పాల్గొని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శైలజనాథ్ మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ కుల, మతతత్వ రాజకీయాలతో ప్రజలను వంచనకు గురిచేస్తున్నదనీ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటీ నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెడుతూ పబ్బం గడుపుకుంటోందన్నారు.
 
 బాధ్యతాయుతమైన పార్టీలో సభ్యులుగా వున్న మనమందరం మొదటినుంచీ బిజెపి ప్రభుత్వం యొక్క కుటిల రాజకీయ ఎత్తుగడలను ప్రజల ముందుంచుతూ ప్రజా క్షేత్రంలో బిజెపి దిగజారుడుతనాన్ని బట్టబయలు చేస్తూనే వున్నామని, దేశాన్ని, దేశ సంపదను అమ్మకానికి పెడుతూ రాజకీయ మనుగడను కాపాడుకోవడానికి బిజెపి ప్రభుత్వం చేయని కుతంత్రాలు లేవన్నారు. దేశంలోని అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ ప్రజలకు నిజాలు తెలియకుండా మతం పేరిట మారణహోమాలు  సృష్టిస్తున్నారన్నారని డాక్టర్ సాకే శైలాజనాథ్ ఆరోపించారు. ఈ కార్యక్రమంలో అనంతపురం పార్లమెంట్ జిల్లా కాంగ్రెస్ కమిటీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.