శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 28 మే 2020 (23:17 IST)

కోవిడ్ ఆస్పత్రి నుంచి పారిపోయిన వృద్ధురాలు.. ఎక్కడ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు పట్టణంలో ఓ కరోనా వైరస్ రోగి కోవిడ్ ఆస్పత్రి ఐసోలేషన్ వార్డు నుంచి తప్పించుకుని పారిపోయింది. ఆ తర్వాత అధికారులు నానా తంటాలు పడి ఆమెను గుర్తించి, తిరిగి తీసుకొచ్చి పోలీసు భద్రత మధ్య ఐసోలేషన్ వార్డులో ఉంచారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కర్నూలు పట్టణానికి చెందిన ఓ వృద్ధురాలికి కరోనా వైరస్ సోకింది. దీంతో ఆమెను కర్నూలు పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. 
 
అయితే, ఈ ఐసోలేషన్ వార్డులో ఉండలేని ఆమె.. వైద్య సిబ్బంది, నర్సుల కళ్లుగప్పి.. వార్డు నుంచి పారిపోయింది. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన వైద్యులు.. అధికారులకు సమాచారం చేరవేశారు. ఆ తర్వాత పట్టణమంతా గాలించగా, ఆదోనీ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో పొదుకూరు మండలం, యాలకుర్తి గ్రామంలో ఉన్నట్టు గుర్తించారు. 
 
ఆ తర్వాత ఆమెను తిరిగి పోలీసుల సహాయంతో తీసుకొచ్చి తిరిగి ఆస్పత్రిలో చేర్చారు. పైగా, ఆమెతో పాటు ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన వారందరినీ హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా అధికారులు ఆదేశించారు. అలాగే, ప్రతి ఒక్కరూ ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్‌లోడు చేసుకోవాల్సిందిగా అధికారులు కోరారు.