1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 15 డిశెంబరు 2020 (21:03 IST)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్ఫ్యూ.. ఎందుకో తెలిస్తే విస్తుపోతారు! - వైన్ షాపులు యధాతథం!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్ఫ్యూ విధించనున్నారు. ఈ కర్ఫ్యూ ఈ నెల 26వ తేదీ నుంచి జనవరి ఒకటో తేదీ వరకు అమల్లో ఉండనుంది. కర్ఫ్యూ ఉన్న కాలంలో అన్ని రకాల వేడుకలను ప్రభుత్వం రద్దు చేసింది. దీనికి కారణం లేకపోలేదు. 
 
ఇప్పటికే ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్...  రెండో దశ వ్యాప్తి త్వరలోనే ప్రారంభమవుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఏపీ సర్కారు ఈ తరహా కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులోభాగంగా, ఐదు రోజుల పాటు కర్ఫ్యూను విధిస్తూ, నూతన సంవత్సర వేడుకలు రద్దు చేసింది. 
 
ఈ నెల 26 నుంచి జనవరి 1 వరకు అన్నిరకాల వేడుకలు రద్దు చేసింది. ముఖ్యంగా, కొత్త సంవత్సరాది నేపథ్యంలో డిసెంబరు 31, జనవరి 1న వేడుకలు జరపరాదని స్పష్టం చేసింది. ఈ రెండ్రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా కర్ఫ్యూ తరహా ఆంక్షలు అమలు చేయనున్నారు.
 
అయితే, రాష్ట్రంలో వైన్ షాపులు, బార్లు తెరిచి ఉంచే వేళలను కూడా కుదించనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం గణనీయంగా తగ్గినా, జనవరి 15 నుంచి మార్చి 15 మధ్యలో కరోనా మరోసారి ప్రజ్వరిల్లే అవకాశం ఉందని కేంద్రం వైద్య సంస్థలు హెచ్చరించిన నేపథ్యంలో రాష్ట్ర సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
 
ఇదిలావుండగా గడచిన 24 గంటల్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మరో ఐదు వందల మందికి కరోనా వైరస్ సోకింది. గడచిన 24 గంటల్లో 61,452 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, వారిలో 500 మందికి పాజిటివ్ అని తేలింది. 
 
అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 88 కేసులు రాగా, కృష్ణా జిల్లాలో 77, పశ్చిమ గోదావరి జిల్లాలో 63, గుంటూరు జిల్లాలో 55 కేసులు గుర్తించారు. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 9 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది.
 
అదేసమయంలో 563 మంది కరోనా నుంచి కోలుకోగా, ఐదుగురు మృతి చెందారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,76,336కి పెరిగింది. మరణాల సంఖ్య 7,064కి చేరింది. ఇప్పటివరకు 8,64,612 మంది వైరస్ ప్రభావం నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,660 మందికి చికిత్స కొనసాగుతోంది.