గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 14 ఏప్రియల్ 2020 (09:27 IST)

నెల్లూరులో తొలి కరోనా మరణం.. తడలో ఒకే ఫ్యామిలీలో 4 పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో తొలి కరోనా మరణం నమోదైంది. అలాగే, ఇదే జిల్లాలోని తడలో ఒకే కుటుంబంలోని నలుగురికి ఈ వైరస్ సోకినట్టు తాజాగా తేలింది. మరోవైపు, జిల్లా వ్యాప్తంగా మొత్తం నమోదైన పాజిటివ్ కేసులు 56గా ఉన్నాయి 
 
కాగా, ఇటీవల కరోనా సోకిన జిల్లా కేంద్రానికి చెందిన ఆర్థోపెడిక్ వైద్యుడిని చికిత్స నిమిత్తం చెన్నై ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతూ కన్నుమూశారు. దీంతో ఆయన అంత్యక్రియలు కూడా చెన్నైలోనే నిర్వహించగా, వాటికి కూడా ఆయన కుటుంబ సభ్యులు హాజరుకాలేని పరిస్థితి నెలకొంది. 
 
మరోవైపు ఆయన భార్య, ఫార్మాసిస్ట్‌కు కూడా కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. 
 
ఇకోవైపు, కరోనా పరీక్షల ఫలితాలు వెల్లడించడంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. సరైన వివరాలు లేకుండానే నమూనాలను సేకరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. 
 
దీంతో ఒకసారి పాజిటివ్‌‌గా మరోసారి నెగిటివ్ అంటూ అందరినీ తికమకకు గురిచేస్తున్నారు. వైద్యఆరోగ్య శాఖ నిర్లక్ష్య పూరిత వ్యవహారంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.