1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , గురువారం, 30 డిశెంబరు 2021 (20:30 IST)

సజ్జల గారు... అమ‌రావ‌తి రాజ‌ధానిపై ప‌రనిందలేల!

అమరావతి రాజధాని విషయంలో వైసిపి చేసిన మోసాన్ని కప్పిపుచ్చుకునేందుకే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇతర పార్టీలపై నిందలు వేస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో అధికార పార్టీగా ఉన్న వై ఎస్ ఆర్ సి పి రాజధాని అంశాన్ని అవకాశవాదంగా మార్చుకుంద‌ని విమ‌ర్శించారు. 
 
వైసిపి తీసుకున్న 3 రాజధానుల ఏర్పాటు నిర్ణయాన్ని రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ అయినా సమర్థించిందా? అమరావతి రాజధానిగా ఉండటం సరైన నిర్ణయం అని వైసిపి ప్రతిపక్షంలో ఉండగా చెప్పిన మాట వాస్తవమా కాదా? ఇప్పుడు సిపిఐ, కాంగ్రెస్, బిజెపి, జనసేన, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు కనుసన్నల్లో నడుస్తున్నాయని సజ్జల చెప్పటం భావ్యమేనా? అని రామ‌కృష్ణ ప్ర‌శ్నించారు.
 
ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని చంద్రబాబు కోరినప్పుడు సిపిఐ పార్టీగా మేము దాన్ని వ్యతిరేకించిన విషయం సజ్జల గారు మరిచారా? 'మాట మార్చం -  మడమ తిప్పం' అన్న జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి విషయంలో మాట మార్చి, మడం తిప్పారా లేదా? వైసిపి గత రెండున్నర ఏళ్లుగా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూ, ఇప్పుడు ఇతరులపై నిందలేయడం తగునా? అన్నారు.
 
తిరుపతిలో అమరావతి రైతుల సభకు పోటీగా మీరు సభ పెట్టి ఫెయిల్ అయ్యార‌ని, అధిక ధరలు, పన్నుల భారాలు, ఉద్యోగులకు పీఆర్సీ అమలు, సిపిఎస్ రద్దు, విద్యుత్ ఛార్జీల పెంపుదల వంటి పలు అంశాల్లో మాట తప్పిన ప్రభుత్వం వైసీపీ అని పరనింద లేసేముందు  స్వయంకృతాపరాధాలు  వైసీపీ గుర్తెరగాల‌ని సూచించారు. సజ్జల గారు... ప్రభుత్వ సలహాదారుగా ఉన్న మీరు విజ్ఞత మరచి మాట్లాడటం సరికాద‌ని రామకృష్ణ హిత‌వు ప‌లికారు.