శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 28 నవంబరు 2020 (06:56 IST)

కృష్ణా జిల్లాలో 94,464 హెక్టార్లలో పంట నష్టం

కృష్ణాజిల్లాలో నివర్ తుఫాన్ కారణంగా ప్రాథమిక అంచనాల ప్రకారం 94,464 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లిందని జిల్లా కలెక్టర్ ఏ.ఎండి.ఇంతియాజ్ అన్నారు.

కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి రెవెన్యూ, తదితర శాఖల అధికారులతో ప్రస్తుత పరిస్థితిపై టెలీకాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ ఇంతియాజ్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఇంతియాజ్ మాట్లాడుతూ.. జిల్లాలో 34 మండలాల్లోని 326 గ్రామాల్లో అధిక వర్షాల కారణంగా పంట నష్టం వాటిల్లిందని కలెక్టర్ అన్నారు.

ఇంతవరకు అందిన సమాచారం ప్రకారం 93,876 హెక్టార్లలో వరి, 150 హెక్టార్లలో ప్రత్తి, 45 హెక్టార్లలో వేరు శెనగ, 49 హెక్టార్లలో మినుము పంటలు పాడైనవని కలెక్టర్ అన్నారు. ఈ అధిక వర్షాల కారణంగా హార్డికల్పర్ పంటలకు సంబంధించి 348 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లిందని కలెక్టర్ అన్నారు.

జిల్లాలో వర్షాల కారణంగా 11 ఇళ్లు, 5 కచ్చా ఇళ్లు దెబ్బతిన్నవని, ఒక కచ్చా ఇల్లు పూర్తిగా పాడైనదని, 4 పాకలు పూర్తిగా పాడైనవని కలెక్టర్ తెలిపారు. విద్యుత్ శాఖకు సంబంధించి 33/కెవి ఫీడర్లు 9. 11/కెవి ఫీడర్లు 32, 33/11 ఫీడర్లు 4, వర్షాల కారణంగా నష్టం వాటిల్లిందన్నారు. 

70 ఎలక్ట్రికల్ పోల్స్ దెబ్బతిన్నాయని జిల్లా కలెక్టర్ ఏ.ఎండి.ఇంతియాజ్ అన్నారు. జిల్లాలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా వున్నారని, కంట్రోల్ రూములు 24 గంటలు పనిచేస్తున్నాయని కలెక్టర్ తెలిపారు.

అన్ని గ్రామ పంచాయతీల్లోను ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుపరచే విధంగా ప్రత్యేక సిబ్బందిని కేటాయించామని, తాగునీరు శుద్ధిచేసి ప్రజలకు అందిచాలని గ్రామ పంచాయతీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

వైద్య ఆరోగ్య శాఖ అవసరమైతే వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని, గ్రామాల్లో వైద్య సిబ్బంది పర్యటించి ప్రజల ఆరోగ్య పరిస్థితుల పై ఆరా తీసి అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఏ.ఎండి.ఇంతియాజ్ ఆదేశించారు.