శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 14 డిశెంబరు 2019 (10:10 IST)

సైబర్‌నేరగాళ్ల నయా మోసం..!

మీ సెల్‌ఫోన్‌కు బ్యాంకు నుంచి మెసేజ్‌ వచ్చిందా.. టెన్షన్‌ వద్దు.. మీ ఖాతాలో నుంచి డబ్బు డ్రా అయ్యాయంటూ నకిలీ మెసేజ్‌లు రావచ్చు.. సైబర్‌నేరగాళ్లు ఇప్పుడు నయా మోసాలకు తెర లేపారు.. అమీర్‌పేట్‌కు చెందిన వైశాలీకి ఎదురైన అనుభవం ఇది. మీ బ్యాంకు ఖాతా నుంచి రూ.10వేలు డ్రా అయ్యాయి..ఈ డబ్బు మీరు డ్రా చేయకపోతే.. మీరు వెంటనే ఈ నంబర్‌కు ఫోన్‌ చేయండి.. మీ సేవలో మీ బ్యాంకు అంటూ ఇంజినీరింగ్‌ చదువుతున్న వైశాలీ సెల్‌ఫోన్‌కు మెసేజ్‌ వచ్చింది.
 
ఆమె వెంటనే తాను డ్రా చేయలేదంటూ వెంటనే ఆ నంబర్‌కు ఫోన్‌ చేసి తన బ్యాంకు ఖాతాలో గుర్తు తెలియని వ్యక్తులు డ్రా చేశారని, అది నేను చేయలేదు.. వెంటనే ఆ డబ్బు నా ఖాతాలోకి వచ్చేట్లు చేసి, నా కార్డును బ్లాక్‌ చేయండంటూ చెప్పుకున్నది. మీరు వెంటనే స్పందించినందుకు ధన్యవాదాలు. మేం మీకు ఒక లింక్‌ పంపిస్తున్నాం.. అందులో మీ వివరాలు పొందుపర్చండి.. ఆటోమేటిక్‌గా ఆ డబ్బంతా మీ ఖాతాలోకి వచ్చేస్తాయంటూ నమ్మించాడు..
 
దీంతో వైశాలీ బ్యాంకు ఖాతా వివరాలను అందులో పొందుపర్చడంతో ఆమె బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.50వేలు రెండు దఫాలుగా మాయమయ్యాయి. ఇది ఒక్క వైశాలీకి సంబంధించిన సమస్య కాదు. ప్రతి రోజు పదుల సంఖ్యలో సైబర్‌నేరగాళ్లు వేస్తున్న వలలో చిక్కుతూ చేతులారా డబ్బును పోగొట్టుకుంటున్నారు.
 
బ్యాంకు పేర్లతో బల్క్‌ ఎస్‌ఎంఎస్‌లు..!
బల్క్‌ ఎస్‌ఎంఎస్‌లతో ఒకేసారి వేలాది మంది ఖాతాదారులకు వల వేస్తున్నారు. ఒక్కసారి వెయ్యి మందికి వల వేస్తే అందులో వంద మంది ఆ వలలో చిక్కుతున్నారు. రూ.10వేల నుంచి రూ.లక్షలకుపైగా నగదును ఈ ఎస్‌ఎంఎస్‌లతో సైబర్‌ మోసగాళ్లు వినియోగదారుల ఖాతాల నుంచి కాజేస్తున్నారు.

రెండు మూడు వేలు పెట్టుబడిగా పెట్టి లక్షల్లో సైబర్‌ నేరగాళ్లు దోచేస్తున్నారు. ఇక్కడ ఆందోళన, భయం అనేది సైబర్‌ నేరగాళ్లు ఖాతాదారులలో స అష్టిస్తున్నారు. ఇప్పటి వరకు ఆశ చూపుతూ అమాయకులను మోసం చేస్తుంది ఒక రకమైతే.. ఇప్పుడు భయపెడుతూ ఖాతాదారులను నిండా ముంచేస్తున్నారు. బల్క్‌ ఎస్‌ఎంఎస్‌లు కూడా ఆయా బ్యాంకుల పేర్లతోనే వస్తుండడంతో ఖాతాదారులు గుడ్డిగా నమ్మేస్తున్నారు.

సైబర్‌ నేరగాళ్లు నయా పంథాలో మోసాలకు పాల్పడుతున్నారు. దొంగే దొంగా.. దొంగా అన్న చందంగా సైబర్‌నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. సాధారణంగా డెబిట్‌కార్డు, క్రెడిట్‌ కార్డును వినియోగదారులు ఉపయోగించినప్పుడు బ్యాంకు నుంచి ఒక మెసేజ్‌ వస్తుంది.. మీ బ్యాంకు ఖాతా నుంచి డబ్బు డ్రా అయ్యింది.. డ్రా చేసింది మీరేనా? కాదా?

ఒక వేళ మీరు కాకపోతే ఈ నంబర్‌కు (అంటే కస్టమర్‌ కేర్‌ నంబర్‌కు) ఫోన్‌ చేయండంటూ అందులో సమాచారం ఉంటుంది. దీనినే సైబర్‌ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకొని అమాయకులను బోల్తా కొట్టించేస్తున్నారు. బ్యాంకులు ఆయా బ్యాంకు పేర్లతో కూడిన ఎస్‌ఎంఎస్‌లు ఆయా ఖాతాదారులకు పంపిస్తుంటారు.

ఖాతా నుంచి డబ్బు డ్రా అయినా, డబ్బు డిపాజిట్‌ అయినా బ్యాంకు నుంచి సమాచారం వస్తుంది. ఎక్కువగా ఈ రెండు అంశాలకు సంబంధించిన విషయాల్లో ఖాతాదారులు అలర్ట్‌గా ఉంటారు. దీంతో నకిలీ మెసేజ్‌లతో ఖాతాదారులపై సైబర్‌నేరగాళ్లు ప్రయోగిస్తున్నారు.
 
ఖాతా వివరాలు చెప్పొద్దు : సైబర్‌క్రైమ్‌ పోలీసులు
సైబర్‌ నేరగాళ్లు వేసే వలలో చాలా మంది అమాయకులు చిక్కుతున్నారు. అయితే ఫోన్‌ చేయడం వరకు బాగానే ఉన్నా.. ఆ తరువాత వాళ్లు అడిగే వివరాలు, పంపించే లింక్‌లతోనే మనమే స్వయంగా ఖాతా వివరాలు, ఇంటర్‌నెట్‌ పాస్‌వర్డ్‌, కస్టమర్‌ ఐడీ, పిన్‌ నంబర్‌ చెప్పేస్తున్నారు.

ఎవరు అడిగినా కార్డు, సీవీవీ, పిన్‌, కస్టమర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌లు చెప్పవద్దు. అసలైన బ్యాంకు కస్టమర్‌కేర్‌ నంబర్‌కు ఫోన్‌ చేస్తే కేవలం కార్డు నంబర్‌తోనే మీ వివరాలు వాళ్ల దగ్గర ఉంటాయి.. మీరేనా?కాదా అని నిర్ధారించుకోవడానికి పుట్టిన తేదీ, ఇంటిపేరు వంటివి అడిగే అవకాశాలుంటాయి. ఎవరూకూడా ఫారం నింపాలి అంటూ, లింక్‌ను పంపించరు, కార్డు, ఖాతా వివరాలు అడుగరు. ఈ విషయాన్ని ఖాతాదారులు గుర్తించుకోవాలని సైబర్‌క్రైమ్స్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రశాంత్‌ సూచించారు.