1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 23 మే 2024 (13:04 IST)

ఆ గ్రామాల్లో పరఢవిల్లిన ప్రజాస్వామ్యం.. దర్శిలో అత్యధిక పోలింగ్!

polling
ప్రకాశం జిల్లాలోని దర్శి అసెంబ్లీ నియోజవర్గంలో ప్రజాస్వామ్య పరఢవిల్లింది. ఈ నెల 13వ తేదీన జరిగిన పోలింగ్ రోజున తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు అమితాసక్తిని చూపించారు. ఓటర్లలో వచ్చిన చైతన్యం కారణంగా రాష్ట్రంలోనే అత్యధికంగా 90.91 శాతం పోలింగ్ శాతం నమోదయ్యేలా చేశారు. ఒంగోలు పార్లమెంట్, దర్శి అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ మనదే అత్యధికం కావడం విశేషం. ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పునకు గీటురాయి అయిన ఓటును సద్వినియోగం చేసుకున్నారు. గంటల సమయం వరుసల్లో నిల్చుని, కొన్నిచోట్ల రాత్రి 12 గంటల వరకూ వేచి ఉండి మరీ హక్కు వినియోగించుకున్నారు. 
 
ఓటేసి తీరాలన్న తపన, కసితో పట్టణ వాసుల కంటే గ్రామీణుల్లోనే ఎక్కువగా కనిపించింది. జిల్లాలో మొత్తం 2,183 పోలింగ్ కేంద్రాలున్నాయి. వీటిలో నాలుగోవంతు కేంద్రాల్లో రాత్రి తొమ్మిది గంటల వరకు పోలింగ్ కొనసాగింది. వృద్ధులు, మహిళలు, యువత.. ఇలా అన్ని వర్గాల వారు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. దేశ, విదేశాల్లో ఉంటున్న జిల్లా వాసులు కూడా ఎక్కువ సంఖ్యలో తరలి వచ్చారు. 1.3 శాతం మంది ఓటర్లు పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకున్నారు. జిల్లాలో ఇప్పటివరకు సాగిన సాధారణ ఎన్నికల్లో ఇదే అత్యధిక పోలింగ్ కావడం గమనార్హం. 
 
ఇకపోతే, జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 2,183 పోలింగ్ కేంద్రాలున్నాయి. వీటిలోని 74 కేంద్రాల్లో 91 శాతానికి పైగా), 1,112 కేంద్రాల్లో (81-90 శాతం), 288 కేంద్రాల్లో (70- 80 శాతం), 34 కేంద్రాల్లో (61-70 శాతం) పోలింగ్ నమోదైంది. కొండపి నియోజకవర్గ పరిధిలోని పొన్నలూరు మండలం సింగరబొట్లపాలెంలో ఏకంగా వంద శాతం పోలింగ్ నమోదైంది. జిల్లాలో ఇదే అత్యధికం. అదే నియోజకవర్గంలోని సింగరాయకొండ మండలం పాకలలోని పోలింగ్ కేంద్రం నం. 271లో మొత్తం 1,178 మంది ఓటర్లు ఉండగా, అందులో 697 మంది(59.17 శాతం) మాత్రమే ఓటేశారు. జిల్లాలో ఇదే తక్కువ పోలింగ్ శాతంగా నమోదైనట్లుగా ఎన్నికల అధికారులు గుర్తించారు.