1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 15 మే 2024 (20:23 IST)

ఏపీలో 81.86 శాతం.. పిఠాపురంలో 86.36 శాతం పోలింగ్ : ముకేశ్ కుమార్ మీనా

mukesh kumar meena
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. మొత్తం పోలింగ్ శాతం 81.86 శాతంగా ఉన్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. ఇదే విషయంలో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్రంలో మొత్తంగా 81.86 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిపారు. ఇందులో ఈవీఎంల ద్వారా 80.66 శాతం, పోస్టల్ బ్యాలెట్‍‌లలో 1.2 శాతం పోలింగ్ నమోదైందని వెల్లడించారు. గత ఎన్నికలతో పోలిస్తే 2.09 శాతం పోలింగ్ పెరిగిందని మీనా తెలిపారు.
 
ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, వైసీపీ అధ్యక్షుడు, సీఎం జగన్, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, నందమూరి బాలకృష్ణ వంటి ప్రముఖులు పోటీ చేసిన వారి వారి నియోజకవర్గాల్లో ఎంత శాతం పోలింగ్ నమోదైందనే వివరాలను కూడా ఆయన వివరించారు. 
 
టీడీపీ చీఫ్, మాజీ సీఎం చంద్రబాబు పోటీ చేసిన కుప్పం నియోజకవర్గంలో 85.87 శాతం పోలింగ్ నమోదైందని తెలిపారు. ఇక ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోటీ పడిన పులివెందులలో 81.34 శాతం పోలింగ్ నమోదైతే, జనసేనాని బరిలో నిలిచిన పిఠాపురం నియోజకవర్గంలో 86.36 శాతం పోలింగ్ నమోదు కావడం విశేషం. 
 
టీడీపీ యువనేత నారా లోకేశ్ పోటీ చేసిన మంగళగిరిలో 85.74 శాతం ఓటింగ్ జరిగింది. అలాగే నందమూరి బాలకృష్ణ బరిలో ఉన్న హిందూపూర్ నియోజకవర్గంలో 77.82 శాతం పోలింగ్ నమోదు కాగా, షర్మిల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన కడపలో 78.73 శాతం పోలింగ్ జరిగిందని వివరించారు.