గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 25 ఆగస్టు 2020 (08:26 IST)

ఏపీలో అవినీతి నిర్మూలనకు దిశ తరహా చట్టం

అవినీతి నిర్మూలనకు త్వరలో దిశ తరహా చట్టం తీసుకురానున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రకటించారు. అవినీతిని కూకటివేళ్లతో సహా పెకిలించాల్సిందేనని అన్నారు.

సిఎం మాట్లాడుతూ.. 1902 నెంబర్‌ను కూడా ఎసిబితో అనుసంధానం చేయాలని, గ్రామ, వార్డు సచివాలయాల స్థాయి నుంచి వచ్చే అవినీతి ఫిర్యాదులను కూడా స్వీకరించాలన్నారు. టౌన్‌ ప్లానింగ్‌, సబ్‌ రిజిస్ట్రార్‌, ఎంఆర్‌ఓ, ఎంపిడిఓ కార్యాలయాల్లో అవినీతి ఆనవాళ్లు ఉండకూడదని చెప్పారు.

14400 నెంబర్‌పై మరింత ప్రచారం నిర్వహించాలని, పర్మినెంట్‌ హౌర్డింగ్స్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిన కేసుల్లోనూ చర్యలు తీసుకోవడానికి సంవత్సరాల కాలం పట్టకూడదన్నారు. అవినీతి కేసుల్లో దిశ చట్టం మాదిరిగానే నిర్దిష్ట సమయంలో చర్యలు తీసుకోవాలన్నారు.

కొన్ని అవినీతి కేసుల విచారణ 25 ఏళ్లుగా సాగుతోందని చెప్పారు. ఈ తరహా కేసులు అవినీతి నిర్మూలనకు చిత్తశుద్దితో లేమన్న సంకేతాలను ప్రజల్లోకి తీసుకువెడతాయని తెలిపారు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడిన వారిపై వెంటనే చర్యలు తీసుకునేలా విధానాలు ఉండాలన్నారు.

అవినీతి నిర్మూలనకు దిశ తరహాలో చట్టం తీసుకురావాలన్నారు. ఆ మేరకు బిల్లును రూపొందిస్తే అసెంబ్లీలో ప్రవేశపెడతామని చెప్పారు.