శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 8 అక్టోబరు 2019 (14:46 IST)

నెల్లూరులో డ్రగ్స్, ఒక గ్రాము రూ.30 వేలు, ఎగబడి కొట్టుకుపోతున్న యువత

ఆ మధ్య టాలీవుడ్‌ను కుదిపేసింది డ్రగ్స్ కేసు. హైదరాబాద్‌లోని హైఫై ఏరియాల్లో మాదకద్రవ్యాలు విచ్చలవిడిగా దొరుకుతున్న వైనం పెను సంచలనం అయ్యింది. ఇప్పుడు ఇలాంటి సంస్కృతే నెల్లూరులో కనిపిస్తోంది.

తాజాగా పోలీసులకు పట్టుబడ్డ ముఠాను ప్రశ్నిస్తే షాకింగ్ నిజాలు బయటికొచ్చాయి. ముఖ్యంగా స్టూడెంట్స్‌ను టూర్గెట్ చేసుకుని.. ఆన్‌లైన్‌లోనే సింథటిక్ డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. ఈ ముఠాలో ఓ విద్యార్థి కూడా ఉండడం ఆందోళన కలిగించే అంశం. ప్రస్తుతం అరెస్టైన వారిలో నైజీరియాకు చెందిన శామ్యుల్, యోహరం ఊచెతోపాటు మరో వ్యక్తి ఉన్నాడు.

బెంగళూరు, చెన్నైల్లో ఉన్న డ్రగ్‌ పెడ్లర్ల కోసం వేట మొదలుపెట్టారు. డార్క్‌నెట్ ద్వారా చాలా వరకూ ఆన్‌లైన్‌లోనే డ్రగ్స్ ఆర్డర్ చేస్తున్నట్టు నెల్లూరు జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగీ చెప్పారు. నెల్లూరులో 2 మెడికల్ కాలేజీలు, పదుల సంఖ్యలో ఇంజినీరింగ్ కాలేజీలు ఉన్నాయి.

వీటిల్లో స్టూడెంట్స్ టార్గెట్‌గా చేసుకుని పార్టీలకు కొందరు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. ఇప్పుడు పోలీసులు సీజ్ చేసిన వాటిల్లో కొకెయిన్, ఎండీఎంఏ, ఎల్ఎస్డీ లాంటివి ఉన్నాయి. అరెస్టైన వాళ్ల నుంచి ల్యాప్‌టాప్, 4 సెల్‌ఫోన్లు సీజ్ చేశారు.
 
గ్రాము 30 వేల నుంచి 50 వేలకు ఈ మాదకద్రవ్యాల్ని విక్రయిస్తున్నారు. చిన్న చిప్స్ మాదిరిగా ఉండే ఎండీఎంఏను నాలుక కింద పెట్టుకుంటే గంటల తరబడి కిక్ ఉంటుంది. ఎల్ఎస్డీ కూడా అంతే. ఇలాంటి వాటికి అలవాటు పడిన వారు నెల్లూరులో వందల మంది ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇటీవల కాలేజీ పిల్లల ప్రవర్తనలో మార్పు గమనించిన కొందరు తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు డ్రగ్స్ రాకెట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు. అప్పుడే ఈ ముఠా గుట్టు రట్టయ్యింది. ఇప్పటికే డ్రగ్స్‌కు బానిసలైన పిల్లల్ని కొందరు తల్లిదండ్రులు చెన్నై లాంటి చోట్లకు తీసుకువెళ్లి డీఎడిక్షన్ సెంటర్లలో చేర్చినట్టు కూడా ఎస్పీ ఐశ్వర్య రస్తోగీ గుర్తించామన్నారు.

అప్రమత్తంగా లేకపోతే డ్రగ్స్ వల్ల జీవితాలే నాశనం అవుతాయన్న విషయం విద్యార్థులు గుర్తుంచుకోవాలని హెచ్చరిస్తున్నారు.