1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 29 డిశెంబరు 2019 (13:53 IST)

రాజధాని రైతుల ఇళ్ళలో పోలీసుల సోదాలు.. ఏడుగురు రైతుల అరెస్టు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రైతుల ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించారు. తుళ్లూరు మండలం వెంకటపాలెం, ఉద్దండరాయుని పాలెం, మందడం గ్రామాల్లోని పలు ఇళ్ళలో పోలీసులు ఆదివారం వేకువజామున ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ తనిఖీల తర్వాత ఐడుగురు రైతులను పోలీసులు అరెస్టు చేసి, తెనాలి రెండో పట్టణ పోలీసు స్టేషన్‌కు తరలించారు.
 
ఈ సందర్భంగా రాజధాని రైతులు మాట్లాడుతూ ఉద్యమాన్ని అణిచివేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని మండిపడ్డారు. అర్థరాత్రి దాటాక తమ ఇళ్లలో పోలీసులు తనిఖీలు చేశారని, కొందరిని అరెస్టు చేసి తీసుకెళ్లారని చెప్పారు. వెంకటపాలెం, మోదుగుల లింగాయపాలెం, మందడం, వెలగపూడి, తుళ్లూరులో పోలీసులు అక్రమ అరెస్టులు చేశారని రైతులు ఆరోపించారు. అరెస్టు చేసిన రైతులను వెంటనే విడిచిపెట్టకపోతే పీఎస్‌ల ఎదుట ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. అరెస్టయినవారిలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉన్నారని రైతులు తెలపారు. 
 
మరోవైపు, రైతుల అరెస్టు విషయం తెలుసుకున్న టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ మరికొంతమంది నేతలతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ధర్నా నిర్వహించారు. ఈ వ్యవహారంపై డీజీపీ గౌతం సవాంగ్ స్పందించారు. రైతుల ఆందోళలో బయట వ్యక్తులు పాల్గొంటున్నారని చెప్పారు. ఆదివారం ఏడుగురు రైతులను అరెస్టు చేసిన మాట వాస్తవమేనని చెప్పారు.