1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : గురువారం, 14 అక్టోబరు 2021 (16:59 IST)

విజయ దశమి శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్

విజయ దశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియ చేసారు. నవరాత్రి వేడుక ధర్మం యొక్క ఔనత్యాన్ని వెల్లడిస్తుందని, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దసరా వేడుకలను జరుపుకుంటున్నామని వివరించారు.

రాష్ట్ర ప్రజలందరికీ కనకదుర్గమ్మ తల్లి ఆశీర్వాదాలు అందించాలని వేడుకుంటున్నానన్నారు. కరోనా ప్రవర్తనా నియమావళిని పాటించటం ద్వారా పండుగ వేడుకలను జరుపుకోవాలని గవర్నర్ ప్రజలకు విజ్ఞప్తి చేసారు. ముఖ ముసుగు ధరించటంతో పాటు,  సామాజిక దూరం పాటిస్తూ  క్రమం తప్పకుండా చేతులు శుభ్రపరుచుకోవాలన్నారు. 

వైరస్ నుండి రక్షణ కల్పించే టీకాలు అందుబాటులో ఉన్నందున అర్హులైన వారందరూ కోవిడ్ -19 వ్యాక్సిన్ ను అశ్రద్ధ చేయకుండా తీసుకోవాలని గౌరవ బిశ్వభూషణ్ హరిచందన్ కోరారు. ఈ మేరకు రాజ్ భవన్ నుండి ఒక ప్రకటన విడుదల చేసారు.
 
దసరా శుభాకాంక్షలు తెలిపిన మంత్రి తానేటి వనిత 
దసరా పండుగను  చెడుపై మంచి, దుష్ట శక్తుల మీద దైవ శక్తులు సాధించిన విజయానికి ప్రతీకగా ప్రజలందరూ  దసరా ఉత్సవాలను  జరుపుకుంటామని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. 
 
గురువారం మంత్రి కార్యాలయం నుంచి దుర్గాదేవి అనుగ్రహంతో ప్రజలంతా తమ తమ రంగాలలో సంపూర్ణ విజయం సాధించాలని తెలుగు ప్రజలందరికీ  ఒక ప్రకటనలో మంత్రి తానేటి వనిత దసరా శుభాకాంక్షలు తెలిపారు. 
 
దసరా పండుగ,  వైఎస్సార్ ఆసరా రెండు ఉత్సవాలు రాష్ట్రంలో మహిళలు ఒకేసారి జరుపుకుంటున్నారని పేర్కొన్నారు.   చెడు ఎంత దుర్మార్గమైనదైనా.. ఎంత శక్తిమంతమైనదైనా.. అంతిమంగా విజయం మంచినే వరిస్తుందని ఆమె అన్నారు.   

మహిషాసురుడిపై మహిళా స్వరూపంగా జగన్మాత సాధించిన విజయాన్ని దసరా ఉత్సవాలు ఇంటింటా ఘనంగా జరుపుకుంటామని గుర్తుచేశారు. జగన్మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖ శాంతులతో, ఆరోగ్యం, సిరి సంపదలతో తులతూగాలని, మహిళలు ఆర్ధిక పురోగతి సాధించాలని కోరుకొంటున్నట్లు ఆమె తెలిపారు.  
 
కరోనా మహమ్మారి  నేపథ్యంలో వ్యక్తిగత స్వీయ నియంత్రణ తో  చేతులు కడగడం, మాస్క్ ధరించటం, భౌతిక దూరం పాటిస్తూ  పండుగను జరుపుకోవాలని  ప్రజలకు మంత్రి విజ్ఞప్తి చేశారు.