శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : గురువారం, 9 మే 2019 (16:52 IST)

హీరో శివాజీకి సైబర్ క్రైమ్ నోటీసులు... రవి ప్రకాష్ భార్యకు కూడా....

హీరో శివాజీతో పాటు టీవీ 9 సీఈఓ రవిప్రకాష్, ఆయన భార్యకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు పంపించారు. సంతకాలను ఫోర్జరీ చేసినట్టు ఇప్పటికే రవిప్రకాష్‌పై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో రవి ప్రకాష్‌ను అరెస్టు చేసేందుకు వెళ్ళగా ఆయన ఇంట్లోలేరు. పైగా, విదేశాల్లో ఉన్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో ఆయన రాకకోసం వేచిచూస్తున్నారు. 
 
మరోవైపు, రవి ప్రకాష్ భార్య, హీరో శివాజీకి సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు జారీచేశారు. రవిప్రకాశ్ ఇంటికి వెళ్లిన పోలీసులు ఆయన భార్యకు 160 సీఆర్పీసీ కింద నోటీసులు అందించారు. ఇదే కేసుకు సంబంధించి హీరో శివాజీకి కూడా నోటీసులు ఇచ్చారు. శుక్రవారం పోలీసుల ఎదుట హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. 
 
ఏడు బృందాలుగా విడిపోయిన సైబర్ క్రైమ్ పోలీసులు సోదాలు జరుపుతున్నారు. టీవీ9 కార్యాలయంలో 12 హార్డ్ డిస్కులను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఈ అంశానికి సంబంధించి ఈ సాయంత్రం పోలీసు అధికారులు ప్రెస్‌మీట్ పెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 
 
ఇదిలావుండగా, రవిప్రకాశ్‌ను సీఈవో పదవి నుంచి తొలగించడంతో హీరో శివాజీ అంశం కూడా తెరపైకి వచ్చింది. టీవీ9లో తాను మైనార్టీ షేర్ హోల్డర్‌నని... తనకు తెలియకుండానే తన షేర్లను అమ్మేశారని ఇప్పటికే నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్‌ను శివాజీ ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో, టీవీ9 వాటాలను కొనవద్దని ట్రైబ్యునల్ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఉత్తర్వులు అమల్లో ఉండగానే యాజమాన్యం బదిలీ కావడం గమనార్హం.