శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 29 ఏప్రియల్ 2019 (10:03 IST)

కర్ణాటక మంత్రి డీకే శివకుమార్‌కు షాక్.. బినామీ ఆస్తులు స్వాధీనం

కర్ణాటక రాష్ట్ర జలవనరుల శాఖామంత్రి, ఆ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్‌కు ఆదాయపన్ను శాఖ అధికారులు తేరుకోలేని షాకిచ్చారు. బినామీలో పేరిట ఉన్న ఆయన ఆస్తులను ఐటీ శాఖ జప్తుచేసింది. జప్తు చేసిన బినామీ ఆస్తుల విలువ రూ.500 కోట్లకు పైమాటగా ఉంది.
 
కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. కానీ, కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా జేడీఎస్‌కు మద్దతు ఇవ్వడంతో బీజేపీ ప్రభుత్వం కూలిపోయింది. అదేసమయంలో కాంగ్రెస్ - జేడీఎస్ ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ ప్రభుత్వ ఏర్పాటులో కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ అత్యంత కీలకపాత్రను పోషించారు. 
 
దీంతో కేంద్ర ప్రభుత్వం ఆయన్ను టార్గెట్ చేసింది. తన ఆధీనంలో ఉన్న ఆదాయ పన్ను శాఖను ప్రయోగించింది. ఫలితంగా ఆయనకు చెందిన రూ.500 కోట్ల విలువైన బినామీ ఆస్తిని జప్తు చేశారు. మరో 20 ఎకరాల భూమి కొనుగోళ్ళకు సంబంధించిన రికార్డులను సమర్పించాలని మంత్రి తల్లి గౌరమ్మకు ఐటి అధికారులు నోటీసులు జారీచేశారు. 
 
ఈ ఆస్తిని శోభా డెవలెపర్స్‌తో మంత్రి డి.కె.శివకుమార్‌, ఆయన తల్లి గౌరమ్మలు ఉమ్మడిగా ఒప్పందం చేసుకున్నారు. అభివృద్ధి చేశాక గౌరమ్మ వాటాగా రూ.235 కోట్ల విలువైన ఆస్తి వచ్చిందని ఆర్థిక మంత్రిత్వశాఖ ట్రిబ్యునల్‌కు ఐటి సమర్పించిన నివేదికలో స్పష్టం చేసింది.
 
అయితే మార్కెట్‌ విలువ రూ.500 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. మంత్రికి సంబంధించిన పలు బినామీ ఆస్తులను ఐటి పరిశీలన జరిపింది. 20 ఎకరాల భూమికి సంబంధించి గౌరమ్మకు నోటీసు జారీ చేశారు. గతంలో కూడా ఆమెకు ఐటి నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కావాలని కోరిన విషయం తెలిసిందే.