1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 19 మే 2021 (14:45 IST)

ఏపీ సర్కారు మెడకు కోర్టు ధిక్కరణ.. నోటీసుల జారీకి హైకోర్టు ఆదేశం

సొంత పార్టీకి చెందిన రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కష్టాలు తప్పేలా లేవు. ఇప్పటికే ఏపీ సర్కారు తీరుతో పాటు.. సీఐడీ ఉన్నతాధికారుల తీరును హైకోర్టు ఎండగట్టింది. 
 
ఈ నేపథ్యంలో నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు వ్యవహరంలో సీఐడీ మెజిస్ట్రేట్ కోర్టు ఆర్డర్స్‌ను రద్దు చేయాలని.. ప్రభుత్వం వేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 
 
హైకోర్టు, మెజిస్ట్రేట్ ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదని.. ఏపీ ప్రభుత్వాన్ని న్యాయస్థానం నిలదీసింది. మధ్యాహ్నం 12 గంటలకు మెడికల్ రిపోర్టు ఇవ్వాలని ఆదేశించినా.. సాయంత్రం 6 గంటల వరకు ఎందుకు ఇవ్వలేదని హైకోర్టు సీరియస్ అయ్యింది. రాత్రి 11 గంటలకు ఆర్డర్ కాపీ ఇచ్చినా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించింది. 
 
ప్రభుత్వంపై సుమోటోగా కోర్టు ధిక్కరణ కింద నోటీసులివ్వాలని ఆదేశించింది. సీఐడీ అడిషనల్ డీజీ, స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు నోటీసులివ్వాలని ఆదేశాలు జారీచేసింది. కోర్టు ధిక్కారం కింద వెంటనే నోటీసులు జారీ చేయాలని జ్యుడీషియల్ రిజిస్ట్రార్‌కు ఆదేశాలిచ్చింది. పౌరుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు కోర్టులు స్పందిస్తాయని వ్యాఖ్యానించింది.