శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By సెల్వి
Last Updated : బుధవారం, 19 మే 2021 (11:08 IST)

నీలం సంజీవరెడ్డి వర్థంతి నేడు.. నిస్వార్థ రాజకీయవేత్త.. జయాలు-అపజయాలు..

Neelam
నీలం సంజీవరెడ్డి వర్థంతి నేడు. అనంతపురం జిల్లా, ఇల్లూరు గ్రామంలో 1913, మే 19న రైతుబిడ్డగా సంజీవరెడ్డి జన్మించారు. భారత రాష్ట్రపతిగా, ఏపీ ముఖ్యమంత్రిగా, లోక్‌సభ సభాపతిగా, ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, సంయుక్త మద్రాసు రాష్ట్రంలో మంత్రిగా, కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడిగా వివిధ పదవులను అధిరోహించి, ప్రజల మన్ననలను పొందిన రాజకీయవేత్త. 
 
ఒక్కసారి ఎం .ఎల్.ఎ ఐతే కోట్లకి పడగలు ఎత్తుతూ రాజకీయ వారసత్వాన్ని ప్రోత్సహిస్తున్న తరుణంలో వాటిని వ్యతిరేకించి ఎలాంటి హంగు ఆర్భాటాలకి పోకుండా నిస్వార్థ సేవలు అందించిన ప్రజా నాయకుడు నీలం సంజీవ రెడ్డి.
 
ముఖ్యంగా లోక్ సభాపతిగా ఎన్నిక కాగానే తన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి అధికార పక్ష -ప్రతిపక్షం మంచి వాతావరణం ఏర్పరచి స్పీకర్ పదవికే వన్నె తెచ్చిన రాయల సీమ రాజకీయ ఆణిముత్యం మన నీలం సంజీవరెడ్డి.
 
మద్రాసు దివ్యజ్ఞాన సమాజం పాఠశాలలోను, అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలోను చదువుకున్నారు. 1935 జూన్ 8న నాగరత్నమ్మను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
 
సంజీవరెడ్డి రాజకీయ జీవితం అనేక ఒడిదుడుకులతో కూడుకున్నది. అనేక విజయాలు, కొన్ని అపజయాలతో పాటు, కొన్ని రాజకీయపు ఎత్తుగడలతో కూడిన త్యాగాలు ఆయన చరిత్రలో ఉన్నాయి. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు, ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటు, ఆ తరువాతి రాజకీయ చరిత్రలతో సంజీవరెడ్డి జీవితం పెనవేసుకుపోయింది. 
 
1940 ల నుండి 1970ల వరకు రాష్ట్ర, దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన ప్రతి ముఖ్య సంఘటనతోను ఆయనకు ప్రమేయముంది.1929 లోనే మహాత్మా గాంధీ స్ఫూర్తితో చదువును పక్కనపెట్టి రాజకీయాల్లో చేరి స్వాతంత్ర్య పోరాటం వైపు దృష్టి సారించారు. 1937లో ఆంధ్ర ప్రాంతీయ కాంగ్రెసు కమిటీకి కార్యదర్శిగా ఎన్నికై దాదాపు పదేళ్ళపాటు ఆ పదవిలో కొనసాగారు. 
 
క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని డిటెన్యూగా జైలుకు వెళ్ళారు.1940, 1945 ల మధ్య ఎక్కువకాలం ఆయన జైలులో ఉన్నారు. 1946లో మద్రాసు శాసనసభకు ఎన్నికయ్యారు. 1947లో రాజ్యాంగ నిర్మాణ సంఘమైన రాజ్యాంగ సభకు ఎన్నికయ్యారు. 1949 నుండి 1951 వరకు మద్రాసు రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసారు.
 
1951లో ఆంధ్ర ప్రాంత కాంగ్రెసు పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు మంత్రిపదవికి రాజీనామా చేసారు. 1951లో ఆంధ్ర ప్రాంత కాంగ్రెసు అధ్యక్షపదవికి ఎన్.జి.రంగాతో పోటీ పడ్డారు. ప్రకాశం మద్దతుగల రంగాను ఆ ఎన్నికలలో ఓడించారు. ఆ తరువాత రంగా, ప్రకాశం కాంగ్రెసును విడిచి వెళ్ళారు. 
 
ఈ కాలంలో సంజీవరెడ్డి జీవితంలో ఒక దుర్ఘటన జరిగింది. ఆయన ఐదేళ్ళ కొడుకు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఆ విషాదాన్ని తట్టుకోలేని సంజీవరెడ్డి, పార్టీ పదవికి రాజీనామా చేసారు. తరువాత పార్టీ పెద్దల వత్తిడిమేరకు రాజీనామాను ఉపసంహరించుకున్నారు.
 
1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినపుడు సంయుక్త మద్రాసు రాష్ట్ర శాసనసభ సభ్యుల నుండి కొత్త రాష్ట్ర కాంగ్రెసు శాసనసభా పక్ష నాయకుణ్ణి ఎన్నుకునే సమయంలో సంజీవరెడ్డి పోటీలేకుండా ఎన్నికయ్యారు. ముఖ్యమంత్రి పదవి తథ్యమైనా, అప్పటి రాజకీయాల ఫలితంగా తాను తప్పుకుని టంగుటూరి ప్రకాశం పంతులుకు నాయకత్వం అప్పగించి, ఉపముఖ్యమంత్రి అయ్యారు. 
 
మళ్ళీ 1955లో రాజకీయాల ఫలితంగానే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని వదులుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ అవతరణలో సంజీవరెడ్డిది ప్రముఖపాత్ర. రాష్ట్ర స్థాపనలో ప్రధాన, నిర్ణాయక ఘట్టమైన పెద్దమనుషుల ఒప్పందంలో ఆంధ్ర తరపున అప్పటి ఆంధ్ర ముఖ్యమంత్రి, బెజవాడ గోపాలరెడ్డితో పాటు ఉపముఖ్యమంత్రిగా ఉన్న సంజీవరెడ్డి కూడా పాల్గొని ఒప్పందంపై సంతకం పెట్టారు. 
 
ఆంధ్రప్రదేశ్ అవతరించాక, కాంగ్రెసు శాసనసభాపక్ష నాయకుడిగా బెజవాడ గోపాలరెడ్డిని ఓడించి, తాను ముఖ్యమంత్రి అయ్యాడు. అల్లూరి సత్యనారాయణ రాజును రాష్ట్ర కాంగ్రెసు అధ్యక్ష పదవి పోటికి నిలబెట్టి, రంగాను ఓడించారు. 1960లో అఖిల భారత కాంగ్రెసు అధ్యక్షపదవికి ఎన్నికవడంతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
 
కాంగ్రెసు అధ్యక్షుడిగా రెండేళ్ళు పనిచేసి, మళ్ళీ 1962లో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యాడు. రవాణా సంస్థల జాతీయీకరణ వివాదంలో సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టడంతో 1964 ఫిబ్రవరి 29 న తనపదవికి రాజీనామా చేసారు. ఆపై సంజీవరెడ్డి కేంద్ర రాజకీయాలలో క్రియాశీలకంగా వ్యవహరించసాగారు.
 
1964 జూన్ 9 న లాల్ బహదూర్ శాస్త్రి ప్రభుత్వంలో ఉక్కు, గనుల శాఖ మంత్రిగా చేరారు. ఆపై రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1967లో ఇందిరా గాంధీ ప్రభుత్వంలో కూడా కొద్దికాలం మంత్రిగా చేశారు. 1967లో నాలుగో లోక్‌సభకు హిందూపురం నియోజకవర్గం నుండి ఎన్నికై, లోక్‌సభకు సభాపతిగా కూడా ఎన్నికయ్యారు. 
 
సభాపతి నిష్పాక్షికంగా ఉండాలనే ఉద్దేశంతో ఎన్నిక కాగానే, కాంగ్రెసు సభ్యత్వానికి రాజీనామా చేసారు. సభాపతిగా ఎన్నిక కాగానే, తన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన మొదటి లోక్‌సభ సభాపతి, సంజీవరెడ్డి.
1969 జూలై 19 న సభాపతి పదవికి రాజీనామా చేసి, రాష్ట్రపతి పదవికి కాంగ్రెసు అభ్యర్థిగా పోటీ చేసారు. 
 
కాంగ్రెసు అంతర్గత రాజకీయాల ఫలితంగా ఆయన, మరో తెలుగువాడు - వి.వి.గిరి - చేతిలో కొద్ది తేడాతో ఓడిపోయాడు. దాంతో సంజీవరెడ్డికి కొద్దికాలం రాజకీయ గ్రహణం పట్టింది. 1975 లో జయప్రకాశ్ నారాయణ్ హైదరాబాదులో జరిపిన పర్యటనతో రాజకీయాల్లో తిరిగి క్రియాశీలకంగా మారాడు. 
 
1977లో ఎమర్జెన్సీ తరువాత, జనతాపార్టీ ప్రభంజనం దేశాన్ని చుట్టుముట్టి కాంగ్రెసును అధికారం నుండి దింపివేసినపుడు, ఆంధ్ర ప్రజలు మాత్రం కాంగ్రెసుకు పట్టం కట్టారు. 42 స్థానాలకుగాను, 41ని కాంగ్రెసు గెలుచుకుంది. జనతాపార్టీ గెలిచిన ఒక్క స్థానమూ సంజీవరెడ్డిదే. 
 
మళ్ళీ లోక్‌సభ సభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. అయితే మళ్ళీ పదవికి రాజీనామా చేసి - ఈసారి నాలుగు నెలల్లోనే - రాష్ట్రపతి పదవికి పోటీ చేసారు. పోటీలో ఉన్న 37 మందిలో ఒక్క సంజీవరెడ్డి నామినేషను తప్ప మరెవరిదీ చెల్లకపోవడంతో, ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పటివరకు ఏకగ్రీవంగా ఎన్నికైన ఒకేఒక్క రాష్ట్రపతి సంజీవరెడ్డినే.
 
1982 లో రాష్ట్రపతి పదవినుండి దిగిపోయాక, రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుని బెంగుళూరులో స్థిరపడ్డాడు. 1996 జూన్ 1 న నీలం సంజీవరెడ్డి మరణించాడు. బెంగుళూరులో కాక్స్ టౌనులో ప్రభుత్వం ఆయనకు సమాధి నిర్మించింది.