మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Updated : శుక్రవారం, 5 జులై 2019 (20:40 IST)

యువతికి హోటల్ సూపర్‌వైజర్ కోర్కె తీర్చాలంటూ వేధింపులు.. ఆ తరువాత?

తిరుపతి లీలామహల్ సర్కిల్ వద్దనున్న ఓ ప్రైవేట్ హోటల్ ముందు యువతి ధర్నాకు దిగింది. హోటల్ సూపర్ వైజర్ తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఆందోళన వ్యక్తం చేసింది. గత కొన్నిరోజులుగా తన కోర్కె తీర్చమంటున్నాడని, నిరుపేద అయిన తాను ఇబ్బందుల్లో ఉన్నానన్న విషయం తెలుసుకుని డబ్బులు ఎరచూపే ప్రయత్నం చేస్తున్నారని యువతి ఆరోపించింది.
 
తన భర్తను, ప్రజా సంఘాలను వెంటపెట్టుకుని హోటల్ ముందు కూర్చుని న్యాయం కోసం ధర్నా చేసింది. దీంతో పోలీసులు భారీగా అక్కడకు చేరుకున్నారు. కొర్లగుంటకు చెందిన స్వాతి అనే యువతికి నాలుగు నెలల క్రితం వివాహమైంది. స్థానికంగా ఒక హోటల్లో బిల్లింగ్ సెక్షన్లో చేరింది. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి సూపర్‌వైజర్ తన కోర్కె తీర్చమంటూ వెంటపడ్డారు. 
 
ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో స్వాతి కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని చెప్పకుండా మనస్సులో బాధను దిగమింగుకుంది. అయితే సూపర్‌వైజర్ వేధింపులు ఎక్కువ కావడంతో భర్తకు విషయాన్ని తెలిపింది. ప్రజా సంఘాలను వెంటపెట్టుకుని హోటల్ ముందు బైఠాయించి ధర్నాకు దిగింది. సూపర్‌వైజర్ వేంకటేశ్వర్లను అరెస్ట్ చేయాలని నినాదాలు చేశారు. దీంతో వేంకటేశ్వర్లు అక్కడి నుంచి పరారయ్యాడు. వేంకటేశ్వర్లు కోసం పోలీసులు గాలిస్తున్నారు.