1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : మంగళవారం, 24 ఆగస్టు 2021 (08:01 IST)

అక్టోబరు25 నుంచి ప్రభుత్వమే నిర్మించనున్న ఇళ్లు: జగన్‌

లబ్ధిదారునికి ప్రభుత్వ భూమిని కేటాయించి, ప్రభుత్వమే వారికి ఇళ్లు కట్టించి ఇచ్చే పనులు అక్టోబరు25 నుంచి ప్రారంభించాలని సిఎం జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ లోగా ఇందుకు అవసరమైన సన్నాహకాలను పూర్తి చేయాలన్నారు. కాలనీల్లో ఇంటర్నెట్‌ సదుపాయం కూడా ఉండాలని సిఎం స్పష్టం చేశారు.

నిర్మాణ సామాగ్రిని సమకూర్చడంలో నాణ్యతా ప్రమాణాలు తప్పకుండా పాటించాలన్నారు. విద్యుద్ధీకరణకు అవసరమైన నాణ్యమైన సామాగ్రిని కూడా లబ్ధిదారులకు అందుబాటులో ఉంచేలా ప్రయత్నాలు చేయాలన్నారు. పట్టణాలు, నగరాల్లోని మధ్యతరగతి ప్రజలకు సరసమైన ధరలకు ప్లాట్లు పథకాన్ని విజయదశమి నాటికి కార్యాచరణ సిద్ధం చేసి అమలు తేదీలు ప్రకటించాలని సిఎం అధికారులను ఆదేశించారు.

రాష్ట్ర వ్యాప్తంగా 3.94లక్షల ప్లాట్లకు డిమాండ్‌ ఉందని, 150,200,250 గజాల విస్తీర్ణంలో ప్లాట్లు వివిద రకాల భూములు గుర్తింపు సమీకరణ చేస్తున్నామని అధికారులు సిఎంకు వివరించారు. టిడ్కో ఇళ్లు ఫేజ్‌ా1లో భాగంగా 85,888 ఇళ్ల పనులు పూర్తి చేశామని, డిసెంబరు 2021 నాటికి కల్లా లబ్ధిదారులకు అందిస్తామని పేర్కొన్నారు. ఫేజ్‌ా2లో 2022 నాటికి ఫేజ్‌ా3 ఇళ్లు పూర్తవుతాయని అధికారులు సిఎంకు వివరించారు.

రాష్ట్రంలో మూడు నగరాలు , వాటర్‌ఫ్లస్‌ సర్టిఫికెట్‌ సాధించడంపై సిఎం అధికారులను ప్రశంసించారు. ఉత్తమ తాగునీటి సరఫరా విధానాలు, మురుగునీటి నిర్వహణపై మార్గదర్శకాలను కలెక్టర్లు, కమిషనర్లకు పంపించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో ఈ గైడ్‌లైన్స్‌ అమలయ్యేలా చూడాలని సిఎం పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి నగరం, మున్సిపాలిటీ కూడా ఈ సర్టిఫికెట్‌ పొందిన నగరాల స్ధాయిని చేరుకోవాలన్నారు.

దేశ వ్యాప్తంగా 9 నగరాలు మాత్రమే వాటర్‌ఫ్లస్‌ సర్టిఫికెట్‌ సాధిస్తే అందులో మూడు నగరాలు మన రాష్ట్రం నుంచే అర్హత సాధించాయని పురపాలకశాఖ మంత్రి బత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఎంపికైన నగరాల్లో విజయవాడ, తిరుపతి, విశాఖపట్టణం ఉన్నాయన్నారు.

ఇళ్లు, వాణిజ్యసముదాయాల నుంచి డ్రైన్లు, నాలాలతో పాటు ఇతర జలాల వ్యర్ధ జలాల శుద్ది, నిర్వహణ, పునర్వినియోగాన్ని నిర్ధేశిత ప్రమాణాల మేరకు సమర్ధవంతంగా నిర్వహించే నగరాలకు వాటర్‌ఫ్లస్‌ సర్టిఫికెట్‌ కేంద్ర, గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ అందిస్తోందన్నారు.