1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By సెల్వి
Last Updated : బుధవారం, 11 ఆగస్టు 2021 (19:32 IST)

మద్యం మత్తులో వేధింపులు, భర్తను మర్మాంగంపై కొట్టి చంపిన భార్య

మద్యం మత్తులో భర్త పెట్టే హింసను భరించలేని ఓ భార్య తానే అతడ్ని హత్య చేసింది. ప్రమాదవశాత్తూ చనిపోయాడని అందర్నీ నమ్మించింది. కానీ మూడు నెలల తర్వాత అసలు నిజం బయటపడటంతో కటకటాల్లోకి వెళ్లింది.
 
వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన కేశవ, రేఖకు కొన్నేళ్ల క్రితం పెళ్లైంది. వీరి కాపురం తొలుత సజావుగానే సాగింది. కానీ ఆర్ధిక ఇబ్బందులు, ఇతర సమస్యల కారణంగా కేశవ మద్యానికి బానిసయ్యాడు. పలమనేరు టమాటా మార్కెట్లో హమాలిగా పనిచేసే కేశవ వచ్చిన డబ్బంతా మద్యానికి తగలేస్తుండేవాడు. 
 
అనంతరం ఇంటికొచ్చి భార్యతో గొడవపడుతుండేవాడు. దీంతో ఇద్దరి మధ్య తరచూ ఘర్షణ జరిగేది. ఈ క్రమంలో ఈ ఏడాది మే 23వ తేదీన ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఇద్దరూ ఇంటి మేడపైకి ఎక్కి గొడవ పడుతున్నారు. ఈ క్రమంలో కేశవ.. రేఖను దూషించాడు. అక్కడితో ఆగకుండా ఆమెను కొట్టాడు. భర్త చేసిన పనికి కోపోద్రిక్తురాలైన రేఖ ఒక్కసారిగా అతడి మర్మాంగంపై కాలితో తన్నింది. 
 
ఆవేశంలో పలుసార్లు తన్నడంతో నొప్పి భరించలేక మేడపై నుంచి కిందపడి మృతి చెందాడు. దీంతో తన భర్త మద్యం మత్తులో మేడపై నుంచి కిందపడిపోయాడని అందర్నీ నమ్మించింది. ఐతే కేశవ తల్లి మాత్రం తన కొడుకు ప్రమాదవశాత్తూ చనిపోలేదని హత్య చేశారని అనుమానం వ్యక్తం చేసింది. దీంతో అనుమాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. 
 
తాజాగా పోస్ట్ మార్టం రిపోర్టులో మర్మాంగాలపై బలమైన గాయాలున్నట్లు వెల్లడైంది. రేఖను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా.. భర్త పెట్టే చిత్రహింసలు భరించలేక తానే హత్య చేసినట్లు నేరాన్ని అంగీకరించింది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండుకు తరలించారు.