ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 11 ఏప్రియల్ 2023 (12:30 IST)

12 నుంచి మచిలీపట్నంలో "ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి

chandrababu
ఈనెల 12వ తేదీన మచిలీపట్నంలో 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమాన్ని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తిరిగి ప్రారంభించనున్నారు. ఆ తర్వాత ఆ రాత్రికి ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరు చేరుకోనున్నారు. అక్కడ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు ప్రారంభించి అక్కడే బస చేస్తారు.13వ తేదీన గుడివాడలో చంద్రబాబు రోడ్ షో, బహిరంగ సభలో పాల్గొననున్నారు. 
 
ఆ రాత్రికి గుడివాడలోనే బస చేయనున్న ఆయన, 14వ తేదీ ఉదయం అంబేద్కర్ జయంతి కార్యక్రమం నిర్వహించనున్నట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. 14వ తేదీ మధ్యాహ్నం నూజివీడులో చంద్రబాబు రోడ్ షో, బహిరంగ సభ జరపాలని నిర్ణయించారు.
 
మరోవైపు, చంద్రబాబు గుడివాడ పర్యటనను నేతలందరం కలసికట్టుగా విజయవంతం చేస్తామని గుడివాడ తెలుగుదేశం నేత వెనిగండ్ల రాము స్పష్టం చేశారు. 
 
అంబేద్కర్ జయంతిని గుడివాడలో జరపాలని చంద్రబాబును తాము కోరామని, దానికి ఆయన అంగీకరించారని తెలిపారు. అదేసమయంలో గుడివాడ తెలుగుదేశంలో ఎలాంటి విభేదాలు లేవని తేల్చిచెప్పారు.

గుడివాడలో చంద్రబాబు పర్యటన ఏర్పాట్లకు జిల్లా నేతలు జరిపిన సమావేశానికి ప్రొటోకాల్ ప్రకారం ఆహ్వానించినట్లు తెలిపారు. సమావేశం జరిగే సమయంలో తాను అందుబాటులో లేనని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో గుడివాడను గెలిచి తీరతామని స్పష్టం చేశారు. 'చాలా రోజుల తర్వాత మా అధినేత చంద్రబాబు గుడివాడకు రాబోతున్నారు. 
 
అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేపడుతున్నాం. మా పార్టీలో అభిప్రాయభేదాలు లేవు. మేమంతా కలిసే వైసీపీపై పోరాడుతాం. అంతే తప్ప మా మధ్య ఎలాంటి గొడవలు లేవు. నేను వేరే కార్యక్రమానికి వెళ్లినప్పుడు సమావేశం నిర్వహించారు. అంతే, ఇక్కడ ఉన్న వైసీపీ నేత చాలా చెబుతారు. అయితే ప్రజలు అవి నమ్మె స్థితి లేదు, వాళ్లు అవి దృష్టిలో పెట్టుకోవాలి' అని గుడివాడ తెలుగుదేశం పార్టీ నేత వెనిగండ్ల రాము అన్నారు.