ఏపీలో కుండపోత వర్షం - వచ్చే 24 గంటల్లో ఫ్లాష్ ఫ్లడ్ ముప్పు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడివుండటంతో ఈ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ కారణంగా కోస్తా, యానంకు ఆకస్మిక వరద ముప్పు పొంచివుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ వర్షాల కారణంగా రాష్ట్రంలోని అనేక జలాశయాల్లో వరద నీరు వచ్చి చేరింది. దీంతో ప్రకాశం బ్యారేజీ నుంచి 4 లక్షల క్యూసెక్కుల ప్రవాహం సాగుతోంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసింది.
ఈ కారణంగా కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ సూచన చేసింది. అదేసమయంలో వచ్చే 24 గంటల్లో కోస్తాంధ్ర, యానాం ప్రాంతాలకు ఆకస్మిక వరదలు (ఫ్లాష్ ఫ్లడ్) సంభవించే ప్రమాదం ఉందని ఐఎండీ తెలిపింది. ముఖ్యంగా, తూర్పు గోదావరి, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు యానాంలో ఈ ముప్పు అధికంగా ఉందని స్పష్టం చేయడంతో అధికార యంత్రాంగం తక్షణ చర్యలు చేపట్టింది.
ఈ వర్షాల కారణంగా కృష్ణానదికి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం 4 లక్షల క్యూసెక్కుల దాటుతుండటంతో అధికారులు మొదటి ప్రమాదం హెచ్చరికలు జారీ చేశారు. నదీ పరివాహక ప్రాంతాలు, లంక గ్రామాల్లో నివశించే ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర విపత్తలు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. ఎవరూ వరద నీటిలో ఈతకు వెళ్లవద్దని, చేపల వేట కోసం నదిలో ప్రవేశించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. నాటు పడవలపై ప్రయాణాలు ప్రమాదకరమని హెచ్చరించారు. ముందు జాగ్రత్తగా చర్యగా కళింగపట్నం, విశాఖ, కాకినాడ, మచిలీపట్నం పోర్టులో ప్రమాద సూచికలు ఏర్పాటుచేశారు.
ప్రస్తుత అల్పపీడనం శుక్రవారానికి మరింత బలపడి పశ్చిమ వాయువ్య దిశగా ఉత్తరాంధ్ర - ఒరిస్సా వైపు కదిలే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్ర అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో మరో వారం రోజుల్లో పాటు వర్షాలు కొనసాగవచ్చని అంచనా వేశారు. గురువారం నాడు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామారాజు, విజయనగరం, నంద్యాల, పల్నాడు జిల్లాలకో ఎల్లో హెచ్చరికలు జారీచేశారు.