1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 31 జులై 2019 (08:29 IST)

పోలవరంపై దేవుడి నిర్ణయమది...మంత్రి అనిల్‌కుమార్‌

ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ సమావేశాలు మంగళవారంతో ముగిశాయి. దీంతో శాసన మండలిని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు చైర్మన్‌ ఎంఏ షరీఫ్‌ ప్రకటించారు. అంతకు ముందు గోదావరి జలాలపై శాసన మండలిలో చర్చ సందర్భంగా జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ..

తెలంగాణతో కలిసి గోదావరి నీటి జాలాల మల్లింపుపై టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుపై ఎటువంటి నిర్ణయాలు రాకముందే టీడీపీ సభ్యులు గోలగోల చేస్తున్నారని ఎద్దేవా చేశారు. నీటి లభ్యత వ్యవహారాలు చూసిన తరువాతే తెలంగాణతో చర్చలు మొదలయ్యాయని స్పష్టం చేశారు.

చంద్రబాబులా చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకున్నట్టు.. చీకటి ఒప్పందాలు చేసుకునే సంస్కృతి తమది కాదని చురకలంటించారు. నాడు ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచేటప్పుడు చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు. 
 
ఎవరికీ అనుమానాలు లేవు..
పోలవరాన్ని వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రారంభిస్తే.. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పూర్తి చేస్తారని.. ఇది భగవంతుడి నిర్ణయమని అన్నారు. రివర్స్ టెండరింగ్‌ ద్వారా ప్రాజెక్టులో రూ.100 కోట్లు తగ్గించిన తమ ప్రభుత్వం.. ప్రజాధనాన్ని కాపాడినట్లేనని అన్నారు. గోదావరి జలాలపై ప్రజలెవరికీ అనుమానాలు లేవని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఉపయోగపడే పనులే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చేపడతారని వెల్లడించారు. ఇది తెలుగుదేశం సభ్యులు గుర్తుంచుకోవాలని హితవు పలికారు.

9 బిల్లులకు మండలి ఆమోదం...
ఈ సమావేశాల్లో మండలిలో 9 బిల్లులు ఆమోదం పొందాయి. సాగుదారుల హక్కు బిల్లు, లోకాయుక్త సవరణ బిల్లు, జీతాలు మరియు పెన్షన్‌ వేతనాల చెల్లింపు బిల్లు, నిర్వాసితుల తొలగింపు బిల్లు, ఆంధ్రప్రదేశ్‌ ద్రవ్యవినిమయ బిల్లు, ఏపీ ల్యాండ్‌ లైటనింగ్‌ బిల్లు, ఆంధ్రప్రదేశ్‌ జీతాలు మరియు పెన్షన్ అనర్హులకు వేతనాల చెల్లింపు తొలగింపు బిల్లు, ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్యానియంత్రణ మరియు పర్యవేక్షణ పరిరక్షణ కమిషన్‌ బిల్లు, ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యా నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్‌ బిల్లులను మండలి ఆమోదించింది.