గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 1 డిశెంబరు 2022 (10:24 IST)

భూవివాదంలో ఏపీ మంత్రి భార్య - 180 ఎకరాలు సీజ్

gummanuru jayaram
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మంత్రి గుమ్మనూరు జయారం సతీమణి రేణుకమ్మ ఓ భూ వివాదంలో చిక్కుకున్నారు. దీంతో ఆమెకు చెందిన 180 ఎకరాల భూమిని ఐటీ అధికారులు సీజ్ చేశారు. ఈ భూములకు సంబంధించి వివరణ ఇవ్వాలంటూ నోటీసులు కూడా ఇచ్చారు. ఈ 180 ఎకరాల భూములను మంత్రి భార్య, బంధువుల పేరుమీద రిజిస్టర్ అయివుందని, ఈ భూలాదేవీలకు సంబంధించిన ఆర్థిక మూలాలు ఇవ్వాలని మంత్రి భార్యకు ఐటీ అధికారులు నోటీసులు జారీ చేశారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఏపీ మంత్రి జయరాం సతీమణి రేణుకమ్మకు కర్నూలు జిల్లా ఆస్పరిలో 30.38 ఎకరాల భూమి కొనుగోలు లావాదేవీలకు సంబంధించి ఈ నోటీసులు జారీచేసింది. మొత్తం రూ.52.42 లక్షల విలువైన భూమి కొనుగోళ్లకు సంబంధించిన లెక్కలు చూపడం లేదని ఆ నోటీసుల్లో పేర్కొంది.
 
ఒకే రోజున జయరాం భార్య, బంధువులు, సన్నిహితుల పేర్లతో వేర్వేరు ప్రాంతాల్లో 180 ఎకరాల భూమి రిజిస్టర్ అయినట్టు అధికారులు గుర్తించారు. ఈ 180 ఎకరాల్లో రేణుకమ్మ పేరుమీద 30.83 ఎకరాలు రిజిస్టర్ అయివుంది. మిగిలిన భూమి రిజిస్టర్ అయిన వాళ్లు మంత్రి బినామీలేనని, నోటీసుల్లో పేర్కొన్నారు. అందుకే ఈ 180 ఎకరాల భూమిని సీజ్ చేసినట్టు తెలిపారు. 90 రోజుల్లోగా ఈ కొనుగోళ్ళకు సంబంధించిన ఆదాయ వనరుల వివరాలను అందజేయాలని ఐటీ అధికారులు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.